ఎన్నికల కమిషన్ ద్వారా మీడియా పాసులు కలిగిన జర్నలిస్టులకు కూడా ఈసారి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతించిందని కలెక్టర్ భారతి హోలీకేరీ తెలిపారు. అయితే పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేందుకు వీలుపడని వారు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని వినియోగించుకుంటే బాగుంటుందని సూచించారు. నవంబర్ 7 వ తేదీ లోపు సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో సమర్పించే ఫారం -12 (డీ)లను మాత్రమే పరిగణలోకి తీసుకుని పోస్టల్ బ్యాలెట్ కు అవకాశం కల్పిస్తారని స్పష్టం చేశారు.
Also Read :Angelo Mathews Wicket: నా పదిహేనేళ్ల కెరీర్లో.. ఇంత దిగజారిపోయిన జట్టును ఎప్పుడూ చూడలేదు: మాథ్యూస్
ఫారం -12 (డీ) దరఖాస్తులు నోడల్ అధికారి, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల నుండి, డీపీఆర్ఓ కార్యాలయం నుండి పొందవచ్చని, ఎన్నికల సంఘం పోర్టల్ నుండి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత ఆర్.ఓ కార్యాలయానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా పోస్టల్ ఓటింగ్ సెంటర్ (పీవీసీ) అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్ణీత ఫారం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం ఉండదని, ఓటరు జాబితాలో వారి పేరును పోస్టల్ బ్యాలెట్ కింద మార్కింగ్ చేయబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
Also Read : Kaleru Venkatesh : అంబర్పేటలో బీజేపీ పతనానికి నాంది పలికారు