Bandi Sanjay Kumar: మరో 5 నెలలు ఆగండి.. తెలంగాణ ప్రజలే కేసీఆర్ సర్కార్ను నిషేధించబోతున్నారు అని జోస్యం చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నంచే మీడియాను కూడా కేసీఆర్ ప్రభుత్వం నిషేధిస్తోంది. ఉద్యమించే నాయకులను అరెస్ట్ చేసి బెదిరిస్తోంది. మరో 5 నెలలు ఆగండి.. తెలంగాణ ప్రజలే కేసీఆర్ సర్కార్ ను నిషేధించబోతున్నారు అని పేర్కొన్నారు.. తెలంగాణ సబ్బండ వర్గాలు అల్లాడుతుంటే.. వందల కోట్ల ప్రజా ధనంతో సొంత పార్టీ డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. చివరకు బీజేపీ ఎదుగుతుంటే ఓర్వలేక పోతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ కు దమ్ముంటే.. తన పాలనలో తెలంగాణలో చేసిన అభివృద్ధిపై శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు నిజాం కాలేజీ మైదానంలో ‘‘ఖేలో భారత్- జీతో భాగ్యనగర్’’ పేరిట నిర్వహించిన క్రీడల పోటీల ఫైనల్ మ్యాచ్ ను తిలకించడానికి వచ్చిన బండి సంజయ్ ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీ ఖేలో ఇండియా పేరుతో బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న అన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో క్రీడల పోటీలు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రాజధానిలో క్రీడలను ప్రోత్సహించాలనే మంచి ఆలోచనతో రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ‘‘ఖేలో భారత్ – జీతో భాగ్యనగర్’’ పేరిట పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు బండి సంజయ్.. క్రికెట్ తోపాటు దేశవాళీ క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నారు. యువతకు క్రీడా స్పూర్తి చాలా అవసరం. క్రీడా స్పూర్తితో ఏ రంగంలోనైనా సమిష్టిగా పనిచేస్తే రాణించవచ్చని ఈ క్రీడలు చాటి చెబుతున్నాయి. నరేంద్రమోడీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోంది. యూపీఏ హయాంతో పోలిస్తే క్రీడల బడ్జెట్ ను 8 రెట్లు అధికంగా కేటాయించేవారు. గతంలో క్రీడల్లో సెలెక్ట్ కావాలన్నా, అవార్డులు ఇవ్వాలన్నా పైరవీలు ఉండేవి. మోడీ వచ్చాక నైపుణ్యమే గీటురాయిగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆయా రంగాల్లో రాణించిన వారికి మాత్రమే అవార్డులు ఇస్తున్నారు. అందులో భాగంగా ‘‘ఖేలో ఇండియా- జీతో భాగ్యనగర్’’అనే నినాదంతో బీజేపీ పనిచేస్తుందన్నారు బండి సంజయ్..
తెలంగాణలో మాత్రం కేసీఆర్ ‘‘తాగుడు-ఊగుడు’’ పథకంతో ‘‘పీలో తెలంగాణ- పిలావో తెలంగాణ’’ నినాదంతో గల్లీగల్లీలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు అని విమర్శించి బండి సంజయ్.. గతంలో రూ.10 వేల కోట్ల ఆదాయమంటే కేసీఆర్ వచ్చాక రూ.40 వేల కోట్లకు చేరింది.. ఆ సంపాదన చాలదని బంపర్ ఆఫర్ పేరుతో మందు రేట్లు తగ్గించి తాగుడును మరింత ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. పంట నష్టోయిన రైతులు ఏడుస్తున్నరు. ఉద్యోగాల్లేక నిరుద్యోగులు బాధపడుతున్నరు. నిలువ నీడ లేక పేదల అల్లాడుతున్నరు. కానీ, అవసరం లేకపోయినా సచివాలయాన్ని కూలగొట్టి కొత్తది కట్టుకున్నడు. ప్రగతి భవన్ కట్టుకున్నడు.. ఇక్కడి ప్రజలను ఆదుకోవాలని చెబుతుంటే. పంజాబ్ పోయి అక్కడి రైతులకు పైసలిస్తడు.. మహారాష్ట్ర వాడికి ఉద్యోగాలిచ్చి లక్షల జీతాలు ఇస్తున్నడు. హైకోర్టు తిడితే ఏపీకి పారిపోయినోడిని పట్టుకుని వచ్చి మళ్లీ ఇక్కడ చీఫ్ అడ్వయిజర్ పోస్టులిచ్చిండు అంటూ మండిపడ్డారు.
మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలు మరింత ఇబ్బందుల్లో పడతారు. స్విగ్గి, జొమాటో మాదిరిగా ఇంటింటికీ మద్యాన్ని పంపిణీ చేస్తాడు అని ఆరోపించారు బండి సంజయ్.. ఇప్పటికే హుక్కా సెంటర్ల పేరుతో బానిసలను చేస్తున్నారు.. అనుమతి లేకపోయినా బీఆర్ఎస్ నేతల అండ ఉంటే ఎక్కడ పడితే అక్కడ హుక్కా సెంటర్లు పెట్టుకోవచ్చనేలా వ్యవహరిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడు.. ప్రజలను ఆదుకోడు.. సీఎం మళ్లీ పొరపాటున గెలిస్తే మరో 5 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజలకు చిప్ప చేతికిస్తడు అంటూ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిలువ నీడ లేని పేదలకు ఇండ్లు కట్టిస్తాం.. పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యన్ని అందిస్తా.. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తాం.. విద్యార్గులకు ఇబ్బంది లేకుండా ఫీజు రీయంబర్స్ మెంట్ అందిస్తాం అని ప్రకటించారు.
ఇక, కర్ణాటక ఎన్నికల ఫలితాలకు… తెలంగాణకు సంబంధం ఏముంది? అని ప్రశ్నించారు సంజయ్.. ఏ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడి ప్రజలు తీర్పు ఇస్తారు? గతంలో 18 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి వచ్చింది? అప్పుడెందుకు మాట్లాడలేదు? కర్నాటకలో గెలిస్తే కాంగ్రెస్ సంబురాలు చేసుకుందా? ఇక్కడి ఆ పార్టీ లేదు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు రావడం లేదన్నారు. మరోవైపు.. ఈటల రాజేందర్ మా జాతీయ నాయకత్వాన్ని కలిస్తే తప్పేముంది? అని ప్రశ్నించారు. ఇక, నా ఢిల్లీ పర్యటన మీడియా సృష్టే అన్నారు. కర్నాటక ఫలితాలతో హిందుత్వం లేదన్నోళ్లకు.. ఆ దమ్ము ఏందో కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్ర ద్వారా నిరూపించాం అన్నారు. రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకమాండ్ కు అప్పీల్ చేశాం.. త్వరలోనే హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.