CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi: అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో భక్తుల నమ్మకాలతో, సనాతన ధర్మ విలువలపై ఆటలాడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యంత ఘాటుగా స్పందించారు. ప్రజల విశ్వాసాలను స్వార్థం కోసం వాడుకునే వారి పట్ల తమ ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ (సహించేదే లేదు) విధానాన్ని అవలంబిస్తుందని స్పష్టం చేశారు. ఆలయ విరాళాల హేరఫేరి ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక విచారణ బృందం (SIT) ప్రాథమిక నివేదిక సమర్పించిన వెంటనే ప్రభుత్వం మెరుపు వేగంతో చర్యలు ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లో నమోదైన ఎనిమిది మంది నిందితులను యూపీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రస్టీ కృష్ణ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై దొంగతనం, నేరపూరిత విశ్వాసఘాతుకం, కుట్ర, అవినీతి వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రమాశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామ్ శంకర్ యాదవ్ అలియాస్ తిన్ను అనే ఎనిమిది మందిని కటకటాల్లోకి నెట్టారు. అయోధ్య విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భక్తితో కూడిన విషయాలలో ఎటువంటి రాజీ ఉండదని సీఎం యోగి గతంలోనే ఇచ్చిన మాటను ఈ వేగవంతమైన చర్యలు నిరూపించాయి. జూన్ 19న తాను అయోధ్య పర్యటనకు వెళ్లినప్పుడే ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేసినా, కోట్ల మంది ఆరాధ్య దైవమైన అయోధ్య ప్రతిష్టకు భంగం కలిగించినా ఊరుకునేది లేదని హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కోట్ల మంది సామూహిక విశ్వాసానికి ప్రతీక అయిన అయోధ్య గౌరవాన్ని, విలువలను కాపాడటమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతని తేల్చి చెప్పారు.
మరోవైపు.. విరాళాల నిర్వహణలో జరిగిన లోపాలపై జూన్ 13న ఏర్పాటైన సిట్ (SIT) విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగదు నిర్వహణ, ఉద్యోగుల వెరిఫికేషన్, సీసీటీవీ నిఘా, అలాగే గర్భాలయం నుంచి ట్రస్ట్ కార్యాలయాలకు, బ్యాంకులకు విరాళాలను తరలించే ప్రక్రియలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. నగదు లెక్కింపు కోసం ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నియమించబడిన స్థానిక సిబ్బందిని, ఆలయ కార్యకలాపాలతో సంబంధం ఉన్న కొందరి సిఫార్సుల మేరకే తీసుకున్నట్లు తేలింది. ఆలయ ప్రాంగణంలో భద్రత, సిబ్బంది కదలికలు, నిబంధనల ఉల్లంఘనలపైనే కాకుండా, భక్తులు సమర్పించిన బంగారం, వెండి వంటి విలువైన వస్తువుల రికార్డులను సైతం సిట్ నిశితంగా పరిశీలిస్తోంది. అయితే ఈ వ్యవహారం రాజకీయంగా కూడా వేడెక్కింది. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ దర్యాప్తుపై స్పందిస్తూ, కేవలం చిన్న చేపలను మాత్రమే బలిపశువులను చేస్తున్నారని, అసలైన పెద్ద తిమింగలాలు తప్పించుకుంటున్నాయంటూ విమర్శలు గుప్పించారు. కేవలం కింది స్థాయి సిబ్బందిపైనే చర్యలు ఉంటాయా లేక ఆలయ ట్రస్ట్ పనితీరులో కీలకమైన నిర్మాణాత్మక మార్పులు ఏమైనా వస్తాయా అనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.
Also Read
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
మరోవైపు ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ నిప్పులు చెరిగారు. గతంలో రామాలయ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారే ఇప్పుడు విమర్శలు చేయడంపై మండిపడ్డారు. ఒకప్పుడు కోర్టుల్లో లాయర్ల సైన్యాన్ని మోహరించి శ్రీరాముడి ఉనికినే నిరాకరించిన వారు, ‘జై శ్రీరామ్’ అని నినదించిన భక్తులపై లాఠీఛార్జ్ చేయించి, తూటాల వర్షం కురిపించిన వారే ఈరోజు భక్తుల నమ్మకాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుంటూ, ఆ పార్టీ దేశంలో అవినీతిని ఓ వ్యవస్థలా మార్చిందని దుయ్యబట్టారు. గతంలో రామనవమి వేడుకల్లో అల్లర్లను ప్రోత్సహించి, శ్రీకృష్ణ జన్మాస్టమీ సంబరాలపై ఆంక్షలు విధించి, కన్వర్ యాత్రను అడ్డుకుని, దుర్గాపూజల సమయంలో ఉద్రిక్తతలు సృష్టించిన చరిత్ర వీరిదని తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతిలో రికార్డులు సృష్టించి దేశాన్ని బలహీనపరిచిన వారు ఈరోజు విచారణను పక్కదారి పట్టించడానికి అయోధ్యపై నిందలు వేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ధార్మిక సంస్థల వ్యవహారాల్లో సంపూర్ణ పారదర్శకతను పాటిస్తూ, ప్రజల నమ్మకాన్ని కాపాడటానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం యోగి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!