NTV Telugu Site icon

Minister Satya Kumar Yadav: ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐతో ఏపీ రూ.88 కోట్ల ఎంఓయూ.. ఒప్పందంపై సంతకాలు

Ap Govt

Ap Govt

Minister Satya Kumar Yadav:  రాష్ట్రంలో ఆహార భ‌ద్రతా ప్రమాణాల్ని మ‌రింత‌ పెంపొందించ‌డానికి భార‌త ఆహార భ‌ద్రతా ప్రమాణాల సంస్థ (Food Safety and Standards Authority of India)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.88.41 కోట్లతో మంగ‌ళ‌వారంనాడు ఢిల్లీలో ఒప్పందాన్ని  కుదుర్చుకుంది. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ స‌మ‌క్షంలో ఎఫ్ఎస్ఎస్ఎఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (CEO) జి.క‌మ‌ల‌వ‌ర్ధన‌రావు, ఏపీ ఫుడ్ సేఫ్టీ క‌మిష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్‌, ఎఫ్ఎస్ఎస్ఎఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇనోషి శ‌ర్మ ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు చేశారు. మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ చొర‌వ‌తో రాష్ట్రంలో ఆహార భ‌ద్రత ప్రమాణాల్ని బ‌లోపేతం చేసేందుకు ఎఫ్ఎస్ఎస్ఎఐ ముందుకొచ్చింది. ఇందుకోసం పూర్తి స‌హ‌కారాన్ని అందిస్తామ‌ని ఎఫ్ఎస్ఎస్ఎఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ జి.క‌మ‌ల‌వ‌ర్ధన‌రావు ఈ సంద‌ర్భంగా స్పష్టం చేశారు.

ప్రధానంగా ఏపీలో ఆహార ప‌రీక్షల ప్రయోగ‌శాల‌లు  ఏర్పాటు చేసేందుకు ఎఫ్ఎస్ఎస్ఎఐ సుముఖ‌త వ్యక్తం చేసింది. రూ. 20 కోట్లతో తిరుమ‌ల‌లోనూ, మ‌రో రూ.20 కోట్లతో క‌ర్నూలులోనూ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్‌ల‌ను నెల‌కొల్పేందుకు ఒప్పందం కుదిరింది. అలాగే ఏలూరు, ఒంగోలుల‌లో ప్రాథ‌మిక ఆహార ప‌రీక్షల ప్రయోగ‌శాల‌ల్నిఒక్కొక్కటి రూ. 7.5 కోట్లతో మొత్తం రూ.13 కోట్లతో నెల‌కొల్పనున్నారు. రాష్ట్రంలో ఆహార శాంపిళ్ల సేక‌ర‌ణ‌, విశ్లేష‌ణ‌ కోసం రూ.12 కోట్లు, ఆహార భ‌ద్రతా ప్రమాణాల‌పై ప్రజ‌ల్లో విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించేందుకు రూ.11 కోట్లు కేటాయించేందుకు ఒప్పందం కుదిరింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబరేట‌రీల‌తో పాటు అద‌నంగా మ‌రో 22 ల్యాబ‌రేట‌రీల‌ను ట‌ర్న్ కీ విధానంలో వినియోగించేందుకు రూ.15 కోట్లు కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఆహార భ‌ద్రతా ప్రమాణాల చ‌ట్టాన్ని ప‌టిష్టంగా అమ‌లు చేసేందుకు కార్యాచ‌ర‌ణ ప్రణాళిక‌ను అమ‌లు చేస్తామ‌ని మంత్రి స‌త్యకుమార్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. అవ‌స‌ర‌మైన మాన‌వ వ‌న‌రుల్ని, మౌలిక స‌దుపాయాల్ని క‌ల్పిస్తామ‌ని, తాజాగా కుదుర్చుకున్న ఒప్పందం ఇందుకు దోహ‌దం చేస్తుంద‌న్నారు. ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్‌లో దేశంలోనే ఏపీ స‌ముచిత స్థానం పొందేందుకు చర్యలు తీసుకుంటామ‌న్నారు. ఆహార భ‌ద్రతా అధికారుల‌తో త‌ర‌చూ స‌మీక్షలు నిర్వహించి భ‌విష్యత్తు ప్రణాళిక‌ల్ని సిద్ధం చేస్తామ‌న్నారు. ప్రతి జిల్లాకొక ఆహార ప‌రీక్ష ప్రయోగ‌శాల కావాల‌ని మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ కోర‌గా అందుకు రూ.15 కోట్లు కేటాయిస్తామ‌ని ఏఎఫ్ఎస్ఎస్‌ఏఐ సీఈవో క‌మ‌ల‌వ‌ర్ధన‌రావు అంగీక‌రించారు.

రూ.140 కోట్లతో రాష్ట్రంలో ఆహార భ‌ద్రతా ప్రమాణాల్ని మెరుగుప‌ర్చడం ద్వారా గ‌ణ‌నీయ‌మైన అభివృద్ధిని సాధించామ‌ని ఫుడ్ సేఫ్టీ క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్ పేర్కొన్నారు. అతి త్వర‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీస‌ర్ల నియామ‌క ప్రక్రియ‌ను ప్రారంభించి పూర్తి స్థాయిలో సిబ్బందిని అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు.