AP BRS office: ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రాష్ట్ర కార్యాలయం ప్రారంభమైంది.. గుంటూరులోని ఆటోనగర్లో రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం.. బీజేపీకి దేశంలో ఎదురు గాలి వీస్తోందన్నారు. మతతత్వ పార్టీ బీజేపీని దేశం నుండి తరిమి కొట్టాలంటే ఒక్క బీఆర్ఎస్ వల్లనే సాధ్యమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ గా తీసుకుని అన్ని రాష్ట్రాలను అభివృద్ధిలో నడిపించాలనే కేసీఆర్ ఈ పార్టీ పెట్టారని తెలిపారు..
ఏపీ అభివృద్ధి పథంలో వెనుకబడి ఉందని విమర్శించారు తోట చంద్రశేఖర్.. దేశంలో అత్యధిక నిరుద్యోం ఏపీలోనే ఉందన్న ఆయన.. గత ఐదు సంవత్సరాలుగా ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదన్నారు.. నిత్యావసర ధరలు ఏపీలో ఆకాశాన్నంటే విధంగా ఉన్నాయి.. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కేంద్ర నుండి మనం రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకు రావటంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపించారు.. తెలంగాణలో కేసీఆర్ మంచి పథకాలను తీసుకు వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు..
ఏపీలో ఉన్న వనరులు తెలంగాణలో లేవు.. అయినా అభివృద్ధిలో ఆ రాష్ట్రం ముందుందని ప్రశంసించారు తోట చంద్రశేఖర్.. తెలంగాణలో కొన్ని లక్షల ఉద్యోగాలు యువతకు వచ్చేలా చేశారన్న ఆయన.. ఇక్కడ ఆర్భాటాలు ఎక్కువ ఆచరణ శూన్యం అంటూ విమర్శలు గుప్పించారు.. ఇంత వరకు రాజధాని నిర్మించుకోలేక పోయాం.. పోలవరం ప్రాజెక్టు కూడా అర్ధాంతరంగా ఆగిపోయిందన్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో హామీలు ఇచ్చారు.. కానీ, ఇంత వరకు నెరవేర్చలేదని ఆరోపణలు గుప్పించారు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.