NTV Telugu Site icon

Tragedy: విషాదం.. కొలంబియాలో ఆంధ్రా యువకుడు అనుమానాస్పద మృతి

Colombia

Colombia

Tragedy: ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. కొలంబియాలో ఆంధ్రా యువకుడు బేతపూడి సుధీర్ కుమార్ మృతి చెందాడు. జి.కొండూరు నుంచి వెళ్లి ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో స్పెయిన్‌లో సుధీర్ కుమార్ అలియాస్ జోషి ఉన్నత చదువులు పూర్తి చేశారు. 10రోజుల క్రితం జి.కొండూరు నుంచి స్పెయిన్ వెళ్తున్నానని చెప్పి సుధీర్‌ అక్కడికి వెళ్లిపోయారు. తర్వాత సోదరి జ్యోత్స్నకు ఫోన్ చేసి స్నేహితురాలు జెస్సికా పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్నానని, సర్ ప్రైజ్ ఇస్తున్నానని సుధీర్ చెప్పినట్లు తెలిసింది. స్నేహితురాలు జెస్సికా పుట్టినరోజుకు కొలంబియా వెళ్లిన సుధీర్‌ కానరాని లోకాలకు వెళ్లిపోయినట్లు మృతుడి సోదరి వెల్లడించారు.

Also Read: Heavy Rains: నాగ్‌పూర్‌లో భారీ వర్షం.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత

మృతుడి సోదరి వెల్లడించిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా సుధీర్‌, జెస్సికా లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నారు. వారిద్దరి మధ్య గత మూడు నెలలుగా మనస్పర్థలు ఉన్నాయని సుధీర్ సోదరి తెలిపింది. ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడని 5రోజుల క్రితం ఫోన్ చేసి సుధీర్ సోదరి జ్యోత్స్నకు జెస్సికా చెప్పింది. చనిపోయే ముందు ఇండియాలో తన సోదరుడితో సుధీర్ మాట్లాడుతున్న వీడియో జ్యోత్స్నకు జెస్సికా పంపింది. అనంతరం సుధీర్‌ చనిపోయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆత్మహత్యా?హత్యా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుధీర్‌ మృతి చెంది 5రోజులు అవుతోంది. మృతి చెంది 5రోజులు గడుస్తున్నా కుటుంబసభ్యులకు చివరి చూపుకు ప్రయత్నాలు ఫలించలేదు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు కూడా ఆర్థిక స్ధోమత లేదంటూ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుని కడచూపు కల్పించాలని కుటుంబసభ్యులు అభ్యర్థిస్తున్నారు. శోక సంద్రంలో మునిగిన కుటుంబసభ్యులు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.