AP Govt: ఏపీ విద్యారంగంలో మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకోబడింది. సీఎం వైయస్ జగన్ ప్రభుత్వంలో మరో గొప్ప ముందడుగు పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విద్య అమలుకు జగన్ సర్కారు శ్రీకారం చుట్టింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐబీ మధ్య ఒప్పందం కుదిరింది. తద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు పాఠశాలల్లో శ్రీమంతుల పిల్లలు చదువుకునే ‘ఇంటర్నేషనల్ బాకలారియెట్’ (ఐబీ) సిలబస్ ప్రకారం పేద పిల్లలకు విద్యాభ్యాసం అందనుంది.
ఐబీ సిలబస్ అమలుపై ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT) అధికారులతో ఐబీ ప్రతినిధులు సీఎం జగన్ సమక్షంలో ఏపీ విద్యాశాఖతో బుధవారం ఒప్పందం చేసుకున్నారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్) డాక్టర్ ఆంటోన్ బెగిన్ (Anton beguin) ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జెనీవా నుంచి వర్చువల్గా ఐబీ డైరెక్టర్ జనరల్ ఒల్లి పెక్క హీనోనెన్ (olli pekka heinonen) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్రెడ్డి, విద్యాశాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
Read Also: YSRCP: వైసీపీలోకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు.. సీఎం జగన్ సమక్షంలో చేరిక
ఈ కీలక ఒప్పందం ప్రకారం 2024-25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. ఉపాధ్యాయులతో పాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అధికారులు, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బంది ఐబీ బోధనపై అవగాహన, సామర్థ్యం పెంచేలా శిక్షణను ఇవ్వనున్నారు. దీంతో వారంతా ఐబీ గ్లోబల్ టీచర్ నెట్వర్క్లో భాగమవుతారు. 2025 జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ బోధన ప్రారంభం కానుంది. ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్ను పెంచుతూ 2035 నాటికి 10వ తరగతి, 2037కి 12వ తరగతిలో అమలు చేస్తారు. పరీక్షల అనంతరం ఐబీ బోర్డు, APSCERT ఉమ్మడిగా సర్టిఫికెట్ను ప్రదానం చేస్తాయి. ఈ ధ్రువపత్రానికి అంతర్జాతీయం గుర్తింపు ఉంటుంది.