ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో త్వరలో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక అధికారుల నియామక బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ గ్రామ పంచాయతీల సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీకాలం పూర్తయిన మరుసటి రోజు నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారి, పర్సన్-ఇన్-ఛార్జ్ లేదా పర్సన్-ఇన్-ఛార్జ్ కమిటీని నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అవసరాన్ని బట్టి ఒక గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక అధికారిని లేదా పలు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక అధికారిని నియమించే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇవ్వబడింది.
Also Read: IPL 2026-SRH Schedule: ఆర్సీబీతో తొలి మ్యాచ్.. సన్రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే!
ఈ పదవులకు తహశీల్దార్, ఎంపీడీవో, ఎంఈవో, డిప్యూటీ ఎంపీడీవో లేదా అంతకంటే ఉన్నత హోదా కలిగిన అధికారులను నియమించాలని ప్రభుత్వం సూచించింది. గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారాలను వినియోగిస్తూ విధులు నిర్వహించేందుకు వీలుగా ఈ ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. గ్రామ పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించే వరకు ఈ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. ఈ నిర్ణయానికి సంబంధించిన నోటిఫికేషన్ను పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ అధికారికంగా జారీ చేశారు.