ఈ నెల 5 న అమిత్ షా, 6న జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రచార షెడ్యూల్ను బీజేపీ విడుదల చేసింది. 5న ఉదయం 11:30 గంటలకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సిర్పూర్ కాగజ్నగర్ లో బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు నిజామాబాద్ పార్లమెంట్ నిజామాబాదులో బహిరంగ సభకు విచేస్తారు. సాయంత్రం 4 గంటలకు మల్కాజ్ గిరి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు అమిత్ షా. ఈ నెల 6న బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా 11 గంటలకు పెద్దపల్లి లో మధ్యాహ్నం 1గంటకు, భువనగిరిలో మధ్యాహ్నం 3.30 గంటలకు నల్గొండలో జరగనున్న బహిరంగ సభలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
ఇదిలా ఉంటే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ చేరుకున్న ఢిల్లీ పోలీసులు నిందితుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిని గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో మన్నే సతీష్, అస్మా, తస్లీమా, గీత, శివ ఉన్నారు.