యువరత్న నందమూరి బాలకృష్ణ యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన మూవీ ‘అఖండ’. డిసెంబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీంతో ఈనెల 27న శనివారం సాయంత్రం అఖండ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేసింది. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్ నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో అఖండ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు బాలయ్య నుంచి సుమారు రెండేళ్ల తర్వాత విడుదలవుతున్న సినిమా కూడా ఇదే. 2019లో వచ్చిన ‘రూలర్’ సినిమా తర్వాత బాలయ్య నటించిన సినిమా ఏదీ విడుదల కాలేదు. ఇప్పటికే విడుదలైన ‘అఖండ’ ట్రైలర్ బాలయ్య అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో బాలయ్య చెప్పిన డైలాగులు ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించాయి. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో శ్రీకాంత్, జగపతిబాబు విలన్లుగా కనిపించనున్నారు.