AICC: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నివాసంలో మున్నూరు కాపు నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. విప్ ఆది శ్రీనివాస్ ప్రతిపాదనతో కుల గణన చేసినందుకు ప్రభుత్వం పట్ల కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, కొంతమంది నేతలు కుల గణన సరిగా జరగలేదని, తమ సంఖ్యను తగ్గించినట్లుగా అభిప్రాయపడ్డారు.
Read Also: Minister Sridhar Babu: పదిమందికి మేలు చేస్తే పది తరాలు గుర్తుండాలి
ఇకపోతే, ఈ సమావేశం విషయంపై AICC (అఖిల భారత కాంగ్రెస్ కమిటీ) సీరియస్ అయింది. కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఈ భేటీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలను పిలిచి, ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. బీసీ కుల గణన చేసిన ప్రభుత్వాన్ని అభినందించాల్సిన పరిస్థితిలో, విమర్శించడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయాల్సిన సమావేశానికి ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలను పిలిపించడం ఏంటని మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు. ఈ ఘటనతో మున్నూరు కాపు నేతల అసంతృప్తి, కాంగ్రెస్ లో అసహనం స్పష్టంగా కనిపించింది. ఈ సమావేశం తర్వాత ఏఐసీసీ స్పందన ఇప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన కలిగించింది. పార్టీ పట్ల నిబద్ధత ఉన్న నేతలు మాత్రమే ముందుకు రావాలని, పార్టీ నియమాలను పాటించవలసిన అవసరం ఉందని అధిష్టానం సందేశం పంపినట్లుగా తెలుస్తోంది.