AICC Observers: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను దేశవ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో జిల్లా అధ్యక్షుల ఎంపిక కోసం పరిశీలకులను నియమించింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు నేతలకు ఏఐసిసి పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ నేత, సిడబ్ల్యూసి (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) సభ్యుడు గిడుగు రుద్రరాజు, ఏఐసిసి సెక్రటరీ సిరివెళ్ళ ప్రసాద్ మధ్యప్రదేశ్ పరిశీలకులుగా నియమితులయ్యారు.
అలాగే తెలంగాణ నుంచి ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ మధ్యప్రదేశ్కు పరిశీలకుడిగా ఎంపికవ్వగా, యువ నాయకుడు వంశీ చంద్ రెడ్డి హర్యానా పరిశీలకుడిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల “సంఘటన్ శ్రీజన్ అభియాన్” పేరిట జిల్లాలో పార్టీ పటిష్టతను పెంచే లక్ష్యంతో ఈ ప్రక్రియ ప్రారంభించింది. తొలి దశగా గుజరాత్లో ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. ఇప్పుడు అదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది.
Read Also: IPL 2025 Top 2 Race: ఆర్సీబీని కాపాడిన సీఎస్కే.. టాప్-2 కోసం ఆ రెండు జట్లు పోటీ!
ఈ ప్రక్రియ ద్వారా పార్టీకి నిజమైన కర్తవ్యనిష్ఠ కలిగిన కార్యకర్తలకు న్యాయం చేయాలని, సమర్థులైన నేతలకు నాయకత్వం కల్పించాలనే సంకల్పంతో ముందుకెళ్తోంది. మధ్యప్రదేశ్లో మొత్తం 50 మంది ఏఐసీసీ పరిశీలకులను, హర్యానాలో 21 మంది పరిశీలకులను నియమించగా.. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఉన్నారు. ఇది రెండు రాష్ట్రాల నేతలకూ గౌరవకరమైన బాధ్యతగా చర్చనీయాంశమవుతోంది.