భారతదేశంలోని అఫ్ఘానిస్థాన్ రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ఆ దేశ రాయబారి ఇవాళ ప్రకటించారు. భారత ప్రభుత్వం నుంచి ఎదురైన నిరంతర సవాళ్ల కారణంగానే నిన్నటి (నవంబర్ 23 వ తేదీ ) నుంచి న్యూఢిల్లీలోని తమ దౌత్య కార్యాలన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం తెలిపింది. ఇక, గత సెప్టెంబర్ 30వ తేదీన ఆఫ్ఘన్ ఎంబసీ కార్యకలాపాలను అంతకుముందు నిలిపివేశామని ఆఫ్ఘన్ రాయబారి ఫరీద్ మముంద్జాయ్ తెలిపారు.
Read Also: Israel-Hamas war: స్వాప్ డీల్ అంగీకరించిన ఇజ్రాయెల్.. బందీల విడుదల జాబితాను అందించిన హమాస్
అయితే, న్యూఢిల్లీలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అప్ఘానిస్థాన్ ఎంబసీ కొనసాగింపు కోసం భారత ప్రభుత్వ వైఖరి అనుకూలంగా అభివృద్ధి చెందుతుందనే ఆశతో ఉన్నామని ఆఫ్ఘన్ రాయబారి ఫరీద్ మముంద్జాయ్ అన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఎనిమిది వారాల నిరీక్షణ తర్వాత, దౌత్యవేత్తలకు వీసా పొడిగింపు జరగలేదని అప్ఘన్ అంబాసిడర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అఫ్ఘానిస్తాన్ దేశంలో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక పరిస్థితుల్లో తీవ్రమైన మార్పు వచ్చిందన్నారు. అయితే, గత రెండు సంవత్సరాలలో భారతదేశంలో నివసిస్తున్న ఆఫ్ఘన్ ప్రజల సంఖ్య గణనీయంగా తగ్గిందని రాయబార కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు 2021 నుండి ఆఫ్ఘన్ శరణార్థులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు దేశం విడిచి వెళ్లడంతో ఈ సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. ఈ కాలంలో చాలా పరిమితమైన కొత్త వీసాలు జారీ చేయబడ్డాయని పేర్కొనింది.