Warangal: వరంగల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సబ్ రిజిస్ట్రార్ల అక్రమ లావాదేవీలు, అనధికారిక వ్యక్తులతో వారు సాగిస్తున్న చీకటి ఒప్పందాలు వెలుగులోకి వచ్చాయి. సబ్ రిజిస్ట్రార్లయిన జమాల్పూర్ రామ్ నర్సింహారావు, దేవులూరి ఆనంద్ తమ కార్యాలయంలో ఇద్దరు వ్యక్తులను అనధికారికంగా డాక్యుమెంట్ రైటర్లుగా నియమించుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. వీరిద్దరూ డాక్యుమెంట్ రైటర్లతో కలిసి రిజిస్ట్రేషన్ల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు.
కేవలం ఈ అనధికారిక రైటర్లు పంపిన పత్రాలను మాత్రమే సబ్ రిజిస్ట్రార్లు ప్రాధాన్యత ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తేలింది. కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తి కాని సుమారు 70 డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్లు, డాక్యుమెంట్ రైటర్ల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు వాట్సాప్ చాట్ ద్వారా బట్టబయలయ్యాయి. గత ఏడాది కాలంలోనే డాక్యుమెంట్ రైటర్ల ద్వారా ఈ ఇద్దరు అధికారులు సుమారు రూ. 42 లక్షలను లంచంగా తీసుకున్నట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది.
Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు
కార్యాలయంలో సోదాల అనంతరం ఏసీబీ బృందాలు ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. వీరి ఇళ్లలో లక్షలాది రూపాయల నగదుతో పాటు భారీగా అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు కనుగొన్నారు. ఇక్కడ ఓ షాకింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. ఓ అధికారి ఇంట్లో రిజిస్ట్రేషన్ చేయని 254 ప్రభుత్వ పత్రాలు లభించడం అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. ప్రభుత్వ కార్యాలయంలో ఉండాల్సిన పత్రాలు అధికారుల ఇళ్లలో ఎందుకు ఉన్నాయనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఈ ఇద్దరు అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న నగదు, డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు.