ఐదు టీ20ల సిరీస్లో భాగంగా బుధవారం ఇంగ్లండ్తో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి (3/23), అక్షర్ పటేల్ (2/22) దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లీష్ కెప్టెన్ జోస్ బట్లర్ (68; 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు) ఒంటరి పోరాటం చేశాడు. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (79; 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లు) సిక్సర్ల మోత మోగించాడు.
తొలి టీ20 మ్యాచ్లో భారత్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దాంతో టీ20ల్లో ఇంగ్లండ్పై టీమిండియా తరఫున రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఈ క్రమంలో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రికార్డును బ్రేక్ చేశాడు. 2018లో మాంచెస్టర్లో జరిగిన టీ20లో రాహుల్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్లో యూవీ 12 బంతుల్లో ఫిఫ్టీ చేసిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదడంతో యువరాజ్ అరుదైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు.
Also Read: Abhishek Sharma: ఆ ఇద్దరి కోసమే అలా చేశా.. అసలు విషయం చెప్పేసిన అభిషేక్ శర్మ!
తొలి టీ20లో భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ కూడా అరుదైన రికార్డును అందుకున్నాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (97) పడగొట్టిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ (96 వికెట్లు) పేరిట ఉండేది. 79 ఇన్నింగ్స్లలో చహల్ 96 వికెట్లు వికెట్స్ పడగొడితే.. అర్ష్దీప్ 61 ఇన్నింగ్స్ల్లోనే అతడిని అధిగమించాడు. ఈ జాబితాలో హార్దిక్ పాండ్యా( 91 వికెట్లు), భువనేశ్వర్ కుమార్ (90), జస్ప్రీత్ బుమ్రా (89) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.