NTV Telugu Site icon

Tripura Crime: దారుణం.. కన్నతల్లిని చెట్టుకు కట్టేసి సజీవదహనం చేసిన కొడుకులు

Tripura

Tripura

Tripura Crime: త్రిపురలో అమానుష ఘటన వెలుగుచూసింది. నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లిని కుమారులే కర్కశంగా సజీవదహనం చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలచివేసింది. పశ్చిమ త్రిపురలోని చంపక్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమర్‌బారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 62 ఏళ్ల వృద్ధ మహిళను ఆమె ఇద్దరు కుమారులు చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారని అధికారులు ఆదివారం వెల్లడించారు. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు కొడుకులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు కుమారులను అదుపులోకి తీసుకున్నామని, కుటుంబ కలహాలే ఈ దారుణ హత్యకు దారితీసి ఉంటాయని అనుమానిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also:Hassan Nasrallah: హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టిన పైలెట్ కు ఘన స్వాగతం!(వీడియో)

ఆ మహిళ భర్త ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిసింది. భర్తను కోల్పోవడంతో ఆ మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి జీవిస్తోంది. ఆమె మరో కుమారుడు అగర్తలాలో ఉండేవాడు. గతం కొంతకాలంగా ఇద్దరు కుమారులు తరచూ గొడవలకు దిగేవారని పోలీసుల విచారణలో తెలిసింది. శనివారం సాయంత్రం ఆమెకు, ఇద్దరు కుమారులకు వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో ఇద్దరు కలిసి మహిళను చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టారు. దీంతో మహిళ సజీవదహనమైంది. కాలిన మృతదేహాన్ని చూసి భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.