GST Scam: రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న జీఎస్టీ మోసాన్ని డైరెక్టరేట్ జనరల్ అఫ్ జీఎస్టీ ఇంటలిజెన్స్ (DGGI) అధికారులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించిన ఈ సిండికేట్ ద్వారా సుమారు రూ. 217 కోట్ల ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) దోపిడీ జరిగినట్లు నిర్ధారణ అయింది. అధికారులు నిర్వహించిన దర్యాప్తులో మొత్తం 72 నకిలీ (షెల్) కంపెనీలు గుర్తించారు. ఇవి కేవలం కాగితాల మీద మాత్రమే ఉండి, ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు లేకుండా తప్పుడు ఇన్వాయిస్ లను సృష్టించి భారీగా ఐటీసీ క్లెయిమ్ చేస్తున్నట్లు బయటపడింది.
ఈ కుంభకోణంలో నిందితులు చాకచక్యంగా వ్యవహరించారు. అమాయకుల ఆధార్, పాన్ కార్డులతో నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చేశారు. ఇంకా ఖాళీ షాపులను అద్దెకు తీసుకుని తాత్కాలిక కార్యాలయాలుగా చూపించారు. దీనితో డిజిటల్ లాగిన్ ల ద్వారా ఇన్వాయిస్ లు జారీ చేశారు. ఈ పద్ధతి ద్వారా దాదాపు రూ. 1,472 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి, అందులో రూ. 217 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం కలిగించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ స్కామ్కు ప్రధాన సూత్రధారి ధంట్ల ఆదిరెడ్డి (అలియాస్ అంజి రెడ్డి) పరారీలో ఉన్నాడు. కాగా రామావత్ నాగరాజు నాయక్, సిద్దిగోని ప్రభాకర్ అనే ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేశారు అధికారులు.
US-Iran War: ఇరాన్లో ఎవరూ ఉండొద్దు.. తక్షణమే ఖాళీ చేయండి.. పౌరులకు అమెరికా హెచ్చరిక
వీరు నకిలీ డాక్యుమెంట్లు సిద్ధం చేయడం, డమ్మీ యజమానులను ఏర్పాటు చేయడం, జీఎస్టీ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. పట్టుబడిన నిందితులపై CGST Act 2017 కింద నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ స్కామ్ లో లబ్ధి పొందిన మరిన్ని వ్యక్తులను గుర్తించేందుకు అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.