Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ని విభజించే అన్ని చర్యల్ని తిప్పికొడుతామని ఆ రాష్ట్ర సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని హెచ్చరించారు. బెంగాల్ని విభజించేందుకు వారిని రానివ్వండి.. దాన్ని ఎలా అడ్దడుకోవాలో వారికి చెబుతాం అని అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ రోజు అన్నారు. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని జిల్లాలను విభజించి కొత్త కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఇటీవల లోక్సభలో ప్రసంగించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: North Korea: కిమ్ తర్వాత ఉత్తర కొరియాను పాలించేది ఈమెనే..
ఇదే విధంగా బంగ్లాదేశ్తో తీస్తా నది నీటిని పంచుకునే విషయంలో బీజేపీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని, దానిని ఎప్పటికీ మేం అంగీకరించబోమని ఆమె చెప్పారు. వరదల నియంత్రణకు బీజేపీ సర్కార్ అన్ని రాష్ట్రాలకు నిధులు ఇచ్చినా, బెంగాల్ నిధులను మాత్రం తగ్గిస్తోందని ఆమె మండిపడ్డారు. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో భారత్-బంగ్లాదేశ్ రివర్ కమిషన్కు అనుగుణంగా భారత్-భూటాన్ రివర్ కమిషన్ ఏర్పాటు చేయాలనే తాను డిమాండ్ చేశానని చెప్పారు.
ఇటీవల జార్ఖండ్కి చెంది బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. జార్ఖండ్ రాష్ట్రంలోకి బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఎక్కువయ్యారని అన్నారు. అక్కడ ఉన్న గిరిజనుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని ఆయన చెప్పారు. సంతాల్ పరగణా ప్రాంతంలోకి బంగ్లాదేశీ చొరబాటుదారులు ప్రవేశించి, గిరిజన మహిళల్ని పెళ్లి చేసుకుంటున్నారని చెప్పారు. గతంలో ఈ ప్రాంతంలో 36 శాతం గిరిజన జనాభా ఉంటే ప్రస్తుతం 26 శాతానికి తగ్గిందని, మిగతా 10 శాతం ఏమైపోయారని ప్రశ్నించారు. ఈ ప్రాంతాల్ని కలిపి కొత్తగా కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని లేకపోతే హిందువులు కనుమరుగు అవుతారని చెప్పారు.