BRICS: బ్రిక్స్ సదస్సు తొలి రోజు ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరుకాలేదు. జిన్పింగ్తో పాటు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బిన్ మహమ్మద్ సహా మరికొందరు నేతలు కూడా ఈ విందుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం బ్రిక్స్ సమావేశాల కోసం న్యూఢిల్లీ చేరుకున్న జిన్పింగ్, ఆ తర్వాత ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత బ్రిక్స్ దేశాధినేతలకు, ప్రముఖులకు ఏర్పాటు చేసిన అధికారిక విందులో జిన్పింగ్ కనిపించలేదు.
అయితే, సుదీర్ఘ ప్రయాణం, టైమ్ జోన్ మార్పు కారణంగా జిన్పింగ్ తీవ్ర అలసట గురైనందునే జిన్పింగ్ విందుకు హాజరు కాలేదని తెలుస్తోంది.ఢిల్లీలో దిగిన తర్వాత జిన్పింగ్ వరసగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బ్రిక్స్ సదస్సుతో పాటు మోడీతో భేటీ కూడా ఉండటంతో ఆయన తొలి రోజు షెడ్యూల్ బిజీ బిజీగా గడిచింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం మోడీ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు కూడా విందులో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు పార్లమెంట్ భవన్ నుంచి రెండు బస్సుల్లో ఢిల్లీలోని భారత్ మండపానికి చేరుకుని విందులో పాల్గొన్నారు. కేంద్ర మంత్రుల్లో అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా హాజరయ్యారు.
రెండు రోజుల బ్రిక్స్ సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. వచ్చే 19వ బ్రిక్స్ సదస్సు చైనాలో జరగబోతోంది. 11 సభ్యదేశాలతో పాటు 10 భాగస్వామ్య దేశాల నేతలు, పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రధాని మోడీ రెండో రోజు కూడా పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు.

