కరోనా ఫస్ట్ వేవ్ తగ్గిందని.. అంతా రిలాక్స్ అవుతోన్న సమయంలో.. సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.. మధ్యలో.. బ్లాక్ ఫంగస్ వచ్చి చేరింది.. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ విజృంభణ కొనసాగుతుండగా.. తాజాగా, బ్లాక్ ఫంగస్ను అంటువ్యాధిగా పరిగణించాలంటూ తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది.. కేసులు వెలుగు చూడగానే తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఇప్పుడు వైట్ ఫంగస్ (కాన్డిడోసిస్) బయట పడడం కలకలం రేపుతోంది.. పాట్నాలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి.. దీంతో అప్రమత్తమైన వైద్యులు.. ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇది.. మహిళలు, పిల్లల్లో చాలా ప్రమాదకరమని వార్నింగ్ ఇచ్చారు. ఇక, బ్లాక్ ఫంగస్ కంటే ఇది చాలా తీవ్రమైనదే కాకుండా శరీరంలోని అనేక భాగాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని చెబుతున్నారు వైద్యులు.
ఓవైపు కరోనా కొత్త వేరియంట్.. బ్లాక్ ఫంగస్ కేసులు, మరణాలు ఆందోళనకు గురిచేస్తుండగా.. వైట్ ఫంగస్ ఇప్పుడు సవాల్గా మారిపోయింది.. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు వైట్ ఫంగస్ ప్రధాన కారణంగా చెబుతున్నారు వైద్య నిపుణులు.. ఊపిరితిత్తులతో పాటు చర్మం, గోర్లు, నోరు లోపలి భాగం, కడుపు, ప్రేగులు, మూత్రపిండాలు, జననేంద్రియాలు, మెదడుకు కూడా వైట్ ఫంగస్ సోకుతుందని హెచ్చరిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్న నలుగురు రోగులు వైట్ ఫంగస్ బారిన పడ్డారని.. వారిలో ముగ్గురికి కరోనా టెస్ట్ చేయగానెగెటివ్గా వచ్చిందని.. అయితే, యాంటీ ఫంగల్ మందులు ఇవ్వగా వారు కోలుకున్నట్టు తెలిపారు పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లోని మైక్రోబయాలజీ విభాగం చీఫ్ డాక్టర్ ఎస్ఎన్ సింగ్.