Mamata Benerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం గురువారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి వచ్చిన సీఎం మమతా బెనర్జీ నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. నీతి ఆయోగ్ సెషన్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన మమత.. ప్రధాని మోడీ అధ్యక్షతన ఆగస్టు 7న జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయం, ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. పశ్చిమ బెంగాల్ జీఎస్టీ బకాయిలపై మమతా బెనర్జీ ప్రధానమంత్రి మోడీతో చర్చించే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆమె కలుస్తారు.
Minister KTR : మోడీ అస్తవ్యస్త, అనాలోచిత నిర్ణయాల వల్లనే దేశ ప్రజలకు కష్టాలు
ప్రతిపక్షాల నేతలతో కూడా మమతా బెనర్జీ భేటీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మనీల్యాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కూడా సమావేశం అయ్యే అవకాశాలున్నాయి. శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెసేతర ప్రతిపక్ష నేతలతో టీఎంసీ చీఫ్ కొన్ని రాజకీయ అంశాలపై కూడా చర్చించవచ్చని తెలుస్తోంది. అయితే సోనియా గాంధీని మమతా బెనర్జీ కలుస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ ఢిల్లీకి చేరుకుని గురువారం పార్టీ ఎంపీలతో జరిగిన భేటీలో ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలపై చర్చించారు. 2024 లోక్సభ ఎన్నికలపై వారితో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొత్తగా ఏర్పాటు చేసిన 7 జిల్లాలకు పేర్లు పెట్టడంలో సలహాలు-సూచనలు ఇవ్వాలని ఎంపీలను ఆమె కోరారని పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి రోజుల్లో ఎంపీలు ఏయే అంశాలను లేవనెత్తాలో సూచించినట్లుగా సమాచారం. బీజేపీకి ‘భయపడవద్దని’ పార్టీ ఎంపీలకు ఇద్దరూ నేతలు స్పష్టంగా చెప్పారు