NTV Telugu Site icon

Vikram-S: భారతీయ అంతరిక్ష రంగంలో అద్భుతం.. తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం సక్సెస్

Vikram S

Vikram S

Vikram S rocket launch successful: భారత అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయం ప్రారంభం అయింది. తొలిసారిగా దేశీయ ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ ప్రయోగం విజయవంతం అయింది. హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ‘ప్రారంభ్’ పేరుతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. శుక్రవారం శ్రీహరికోట్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి విక్రమ్-ఎస్ రాకెట్ ని విజయవంతంగా నింగిలోకి పంపారు. మూడు పేలోడ్లను తనతో పాటు అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఉదయం 11.30 గంటలకు విక్రమ్-ఎస్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. కేవలం 4.50 నిమిషాల్లో ప్రయోగం పూర్తయింది. దేశానికి చెందిన రెండు పేలోడ్లతో పాటు అర్మేనియాకు చెందిన విదేశీ పేలోడ్ ను 89.5 కిలోమీటర్ల లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టింది.

Read Also: Twitter : ఎలాన్ మస్క్‎కు ఉద్యోగుల షాక్.. ట్విట్టర్‎కు వందలాది మంది గుడ్ బై

మొత్తం 545 కిలోల బరువుతో, 6 మీటర్ల పొడవు ఉండే విక్రమ్-ఎస్ దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్. రాకెట్ గమనం, వేగం, ఖచ్చితత్వాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ రాకెట్ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. 2020లో అంతరిక్షంలో ప్రైవటు కంపెనీలకు అవకాశాలను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రయోగించిన తొలి రాకెట్ గా విక్రమ్-ఎస్ చరిత్రకెక్కింది. భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఇది కొత్త అధ్యాయమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఇది కొత్త ప్రారంభం అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. ఇస్రోకు అభినందనలు తెలిపారు కేంద్రమంత్రి. భారత అంతరిక్ష పితామహుడుగా పేరొందిన విక్రమ్ సారాభాయ్ పేరుతో ఈ రాకెట్ కు విక్రమ్ – ఎస్ అని నామకరణం చేశారు.