India Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్కి రష్యా అందించాల్సిన రెండు స్క్వాడ్రన్ల S-400 క్షిపణి వ్యవస్థల డెలివరీ ఆలస్యమైంది. అయితే, వీటిని 2026-27 నాటికి పంపిణీ చేస్తామని రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్, భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కి హామీ ఇచ్చారు. చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశం సందర్భంగా ఇద్దరూ ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాలు దీర్ఘకాలిక రక్షణ భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటించాయి.
ఈ సమావేశంలో భారత్ అదనంగా మరో రెండు S-400 వ్యవస్థలను కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యాన్ని భారతదేశం అధికారికంగా వ్యక్తం చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎస్-400తో పాటు స్వదేశీ డిఫెన్స్ వ్యవస్థలు చాలా బాగా పనిచేశాయి. పాకిస్తాన్ దాడులను విజయవంతంగా తిప్పికొట్టాయి. 600 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను గుర్తించి, 400 కి.మీ దూరంలో ఉన్న వాటిని అడ్డుకోగల సత్తా ఎస్-400 సొంతం.
Read Also: Rahul Gandhi: ఆర్ఎస్ఎస్ ముసుగు తొలగింది.. “రాజ్యాంగ పీఠిక” వివాదంపై రాహుల్ గాంధీ..
2018లో సంతకం చేయబడిన USD 5.43 బిలియన్ల ఒప్పందంలో భాగంగా ఎస్-400 ట్రయంఫ్ సర్ఫేస్ టూ ఎయిర్ క్షిపణులు కలిగిన వ్యవస్థపై భారత్, రష్యా మధ్య ఒప్పందం కుదిరింది. వీటిలో ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆలస్యమవుతున్న మరో రెండు స్క్వాడ్రన్లను 2026-27 నాటికి డెలివరీ చేస్తామని రష్యా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు హామీ ఇచ్చారు. యుద్ధం కారణంగా సప్లై చైన్ దెబ్బతినడంతో డెలివరీకి అంతరాయం ఏర్పడింది. భారతదేశంలో ఇప్పటికే ఐదు యూనిట్లలో మూడింటిని అందుకుంది.
ఇదిలా ఉంటే, చర్చల్లో భాగంగా భారత్ సుమారు 260 Su-30 MKI ఫైటర్ జెట్ల అప్గ్రేడ్ చేయాలని భావిస్తున్నట్లు ప్రస్తావనకు వచ్చింది. వీటి పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచే ప్లాన్లో భాగంగా అప్గ్రేడ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలలో ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు మరియు ఇతర కీలకమైన సైనిక హార్డ్వేర్లను కలిసి ఉత్పత్తి చేసే ప్రణాళికలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే, భారత్ తన సొంత వైమానిక రక్షణ వ్యవస్థ, ప్రాజెక్ట్ కుషాను డెవలప్ చేస్తోంది. 2028-29లోగా ఆపరేషన్లోకి తేవాలని యోచిస్తోంది. హైపర్ సోనిక్ క్షిపణులు, డ్రోన్ సామర్థ్యాలను అందిపుచ్చుకోవడంతో సహా ఇతర రక్షణ సాంకేతికతను కూడా దేశం అన్వేషిస్తోంది.