Trump Immigration: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా నుంచి ఇప్పటి వరకు ఎంత మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారంటే!

  • అమెరికా నుంచి వేలాది భారతీయుల డిపోర్టేషన్..
  • అధికారిక లెక్కలు వెల్లడి
Donald Trump

Donald Trump

Trump Immigration: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులపై డిపోర్టేషన్ చర్యలు కొనసాగుతున్నాయి. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 4,840 మంది భారత పౌరులను అమెరికా బహిష్కరించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 జనవరి నుంచి జూలై వరకు మాత్రమే 1,273 మంది భారతీయులను అమెరికా నుంచి భారత్‌కు పంపించారని, అంతకుముందు 2025లో 3,567 మంది భారత పౌరులు డిపోర్ట్ అయ్యారని తెలిపారు.

భారత పౌరసత్వం నిర్ధారణ తర్వాతే స్వదేశానికి తరలింపు

డిపోర్టేషన్ కేసుల్లో భారత్ అన్ని సంబంధిత దేశాల ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటోందని జైస్వాల్ చెప్పారు. ఏ వ్యక్తిని భారత్‌కు పంపించే ముందు అతను లేదా ఆమె నిజంగా భారత పౌరుడేనని పూర్తిస్థాయిలో నిర్ధారిస్తామని వెల్లడించారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలను అరికట్టే లక్ష్యంతో చేపట్టిన కఠిన ఇమ్మిగ్రేషన్ విధానంలో భాగంగా పెద్ద ఎత్తున డిపోర్టేషన్ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు కూడా గణనీయ సంఖ్యలో బహిష్కరణకు గురవుతున్నారు. అయితే డిపోర్ట్ అయ్యే భారతీయుల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలని భారత్ అమెరికా ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్‌లో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయకుండా చూసేలా అమెరికా అధికారులతో ప్రత్యేకంగా చర్చించినట్లు వెల్లడించారు. 2025లో 73 ఏళ్ల భారతీయురాలు హర్జీత్ కౌర్ డిపోర్టేషన్ సమయంలో దురుసుగా వ్యవహరించినట్లు వచ్చిన వార్తలు తీవ్ర ఆందోళనకు దారితీశాయి. అలాగే అంతకుముందు డిపోర్టేషన్ విమానంలో మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేసిన ఘటనపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనలపై భారత్ అమెరికా ప్రభుత్వానికి అధికారికంగా నిరసన కూడా తెలిపింది.