కరోనాతో తల్లిదండ్రులు, సంరక్షలను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్… కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.5 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్టు ప్రకటించారు.. 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ మొత్తాన్ని వడ్డీతో సహా అందించే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక, ఆ చిన్నారులకు స్కూల్, కాలేజ్, గ్రాడ్యుయేషన్ వరకు విద్యా మరియు వసతి ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందన్న సీఎం స్టాలిన్.. అలాంటి అనాథ పిల్లల కోసం ప్రభుత్వ గృహాల్లో వసతి కల్పించడానికి ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.. అంతేకాదు.. ఆ చిన్నారులకు 18 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున భత్యం కూడా ఇస్తామని ప్రకటించారు. ఇక, కోవిడ్తో అనాథలైన చిన్నారులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఎంకే స్టాలిన్. మరోవైపు.. కరోనాతో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు కూడా రూ.3 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు.