కరోనా మహమ్మారి విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. కోవిడ్ విజృంభిస్తే చాలు.. మొదట మూసివేసేది స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలే అనే విధంగా తయారైంది పరిస్థితి.. దీంతో.. విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయి. అయితే, ఓవైపు కరోనా కల్లోలం సృష్టిస్తున్నా.. ఇప్పటికే మూతపడిన స్కూళ్లను మళ్లీ తెరిచేందుకు సిద్ధం అవుతోంది మహారాష్ట్ర ప్రభుత్వం.. వచ్చే వారం నుంచే అన్నిస్కూళ్లు తెరుకోనున్నాయని, అన్ని తరగతులు ప్రారంభిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ తెలిపారు.. కానీ, కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని.. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లు తిరిగి ప్రారంభవుతాయని వెల్లడించారు.. అంతేకాదు.. సీఎం ఉద్ధవ్ థాకరే కూడా తమ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు మంత్రి గైక్వాడ్.
కాగా, ఓవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు, మరోవైపు డెల్టా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తూ కల్లోలమే సృష్టిస్తున్నాయి.. దీంతో.. ఫిబ్రవరి 15వ తేదీ వరకు స్కూళ్లను మూసివేస్తున్నట్టు మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది.. కానీ, కొన్ని వర్గాల నుంచి స్కూళ్లను ఓపెన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోందని చెబుతున్నారు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్.. దీనిపై నిపుణులతో చర్చించి ఆ తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని.. మొదటగా కోవిడ్ కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రారంభిస్తామని తెలిపారు. మరోవైపు.. కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతుండడంతో.. తెలంగాణలో ఈ నెల 30వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.