Digvijaya Singh: బీజేపీ, ఆర్ఎస్ఎస్లను ఎప్పుడూ విమర్శించే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, తాజాగా ఈ సంస్థలపై ప్రశంసలు కురిపించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని రాహుల్ గాంధీకి లేఖ రాసిన వారం తర్వాత కొత్త వివాదానికి తెర లేపారు. 1990ల నాటి ప్రధాని మోడీ, అద్వానీల బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేస్తూ, బీజేపీ దాని సైద్ధాంతిక మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై ప్రశంసించారు.
Read Also: Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఛార్జిషీట్ దాఖలు, ఏ-11గా అల్లు అర్జున్!
గుజరాత్లో జరిగిన ఒక కార్యక్రమంలో బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ కుర్చీలో కూర్చుని ఉండగా, ఆయన ముందు నేలపై నరేంద్రమోడీ కూర్చుని ఉన్న ఫోటోను మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన దిగ్విజయ్ సింగ్ షేర్ చేశారు. దీనిని ప్రస్తావిస్తూ.. ఒకప్పుడు నేలపై కూర్చున్న సామాన్య కార్యకర్తలు సంఘ్-బీజేపీ వ్యవస్థలో ఎలా ఎదిగి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా మారగలరో అని ప్రశంసించారు. “ఈ చిత్రాన్ని నేను క్వోరా సైట్లో చూశాను. ఇది చాలా ఆకట్టుకుంటుంది. ఆర్ఎస్ఎస్ యొక్క సామాన్య స్వయంసేవకులు (కార్యకర్తలు), బీజేపీ కార్యకర్తలు నాయకుల పాదాల వద్ద నేలపై కూర్చుని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా ఎలా ఎదుగుతారో చూడండి. ఇదే ఆ సంస్థ శక్తి. జై సియా రామ్,” అని ఎక్స్లో ట్వీట్ చేశారు.
దిగ్విజయ్ షేర్ చేసిన ఈ ఫోటో 1996లో గుజరాత్ ముఖ్యమంత్రిగా శంకర్ సింగ్ వాఘేలా ప్రమాణ స్వీకారంలో తీసింది. ఈ కార్యక్రమానికి అప్పటి బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. అయితే, డిగ్గి రాజా ట్వీట్పై బీజేపీ రాహుల్ గాంధీపై సెటైర్లు కురిపించారు. పార్టీ అధికార ప్రతినిధి సిఆర్ కేశవన్ మాట్లాడుతూ.. సింగ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకత్వంలోని నిరంకుశ, ప్రజాస్వామ్య వ్యతిరేక స్వభావాన్ని తెలియజేస్తోందని అన్నారు.