‘పుష్ప 2’ సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తంగా 23 మందిపై అభియోగాలు మోపారు. కేసు ఛార్జిషీట్లో ఏ-11గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరును పోలీసులు చేర్చారు.
Also Read: AUS vs ENG 4th Test: పరాజయాల పరంపరకు తెర.. 5468 రోజుల తర్వాత గెలిచిన ఇంగ్లండ్!
ఛార్జిషీట్లో ఏ-1గా సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ను పోలీసులు చేర్చారు. అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా 8 మంది బౌన్సర్లపై ఛార్జిషీట్ దాఖలైంది. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 35 ఏళ్ల రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ (9) తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు ఛార్జిషీట్ దాఖలు చేశారు.