Ram Temple Inauguration: జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతోంది. దేశవ్యాప్తంగా ప్రజలు, భక్తులు ఈ అద్భుత ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశంలోని పలువురు కీలక వ్యక్తులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవుతున్నారు. సాధువులతో పాటు ఫిలిం స్టార్స్, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు దీనికి హాజరవబోతున్నారు. ఇప్పటికే యూపీ ప్రభుత్వం రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి అన్ని కార్యక్రమాలను చేసింది.
Read Also: Ram Mandir: శ్రీరాముడి కోసం బంగారు పాదరక్షలు.. 8 వేల కి.మీ పాదయాత్ర చేస్తున్న హైదరాబాద్ వ్యక్తి..
ఇదిలా ఉంటే జనవరి 22న జరగబోయే రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఉత్తర్ ప్రదేశ్లోని అన్ని జైళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని యూపీ జైళ్లశాఖ మంత్రి ధర్మవీర్ ప్రజాపతి శనివారం తెలిపారు. ఖైదీలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. యూపీ వ్యాప్తంగా జైళ్లలో 1.05 లక్షల మంది ఖైదీలు ఉన్నారని, వారు కూడా ఈ దేశ పౌరులే, ఈ సందర్భానికి దూరంగా ఉంచకూడదని నిర్ధారించుకుని, అన్ని జైళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఖైదీలందరూ ప్రొఫెషనల్ నేరస్తులేమీ కాదని ఆయన అన్నారు. పరిస్థితుల ప్రభావంతో నేరస్తులుగా మారుతారని, పవిత్రమైన ఈ రామ మందిర ప్రారంభోత్సవానికి వారిని దూరం చేయకుండా, జైళ్లలో ఏర్పాట్లను చేస్తున్నామని చెప్పారు.
బీజేపీ అయోధ్య రామ మందిర మహోత్సవాన్ని దేశవ్యాప్తంగా బూత్ స్థాయిలో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ప్రణాళిక ప్రకటించింది. బీజేపీ కార్యకర్తలు సామాజిక సేవల్లో పాల్గొనలాని, కార్మికులకు దుప్పట్లు పంచడం, విందులు ఏర్పాటు చేయాలని, అందరికి పండ్లు, ఆహారం అందించాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.