Rahul Gandhi: పాకిస్తాన్ మాజీ మంత్రి సోషల్ మీడియాలో రాహుల్ గాంధీని పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్లో సమాచార మంత్రిగా పనిచేసిన ఫవాద్ హుస్సేన్ ‘‘రాహుల్ గాంధీ అన్ ఫైర్’’ అనే కామెంట్స్ చేశారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయా, పాకిస్తాన్తో కాంగ్రెస్ సంబంధాన్ని ప్రశ్నించారు.
‘‘ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్లో సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన సి.హెచ్. ఫవాద్ హుస్సేన్ రాహుల్ గాంధీని ప్రమోట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ యోచిస్తోందా?’’ అని ప్రశ్నించారు. ముస్లిం లీగ్ ఆనవాళ్లు ఉన్న మానిఫేస్టోని కలిగిన పార్టీకి పాకిస్తాన్ నుంచి మద్దతు లభిస్తోందని చెప్పారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కూడా ఇదే విధంగా స్పందించారు. పాకిస్తాన్తో కాంగ్రెస్ స్పష్టమైన పొత్తును కలిగి ఉందని ఆరోపించారు.
Read Also: Kharge: ప్రధాని మోడీకి ఖర్గే లేఖ.. దేనికోసమంటే..!
పూనావాలా సోషల్ మీడియా పోస్టులో స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్ తన అభిమాన పార్టీ అని గతంలో ఉగ్రవాది హఫీస్ సయీద్ చెప్పారు. మణి శంకర్ అయ్యర్ ప్రధాని మోడీని నిలదీయడానికి మద్దతు కోసం పాకిస్తాన్ వెళ్లాడు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు లేవనెత్తారు. బీకే హరిప్రసాద్ ఏకంగా బహిరంగంగానే పాక్కి మద్దతుగా మాట్లాడటం గుర్తుంది. పదేపదే కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్, దాని ఉగ్రవాదుల్ని సమర్థిస్తున్నారు’’ అని అన్నారు.
పాక్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ షేర్ చేసిన వీడియోలో.. రాహుల్ గాంధీ ముఖ్యంగా నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శించడం వినొచ్చు. రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని వినొచ్చు. బీజేపీ అట్టడుగు వర్గాల ప్రయోజాలను విస్మరిస్తోందని ఆరోపించారు.