రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి ఆమె నామపత్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు పాల్గొంటారు. ముర్ము నామినేషన్పై మోదీ, అమిత్ షా, రాజ్నాథ్, నడ్డా, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలు సంతకాలు చేయనున్నారు. మొదటగా ప్రధాని మోదీ.. ముర్ము పేరును ప్రతిపాదిస్తారు. నామినేషన్ పత్రాలను 50 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదించి, మరో 50 మంది బలపరచాల్సి ఉంది.
నామినేషన్ దాఖలుకు ఒకరోజు ముందుగా గురువారమే ఢిల్లీకి చేరుకున్న ద్రౌపది ముర్ము.. ఒడిశా భవన్లో బస చేశారు. భువనేశ్వర్ విమానాశ్రయంలో పలు పార్టీల నాయకులు, అభిమానులు ఆమెకు వీడ్కోలు పలికారు. గిరిజన నృత్యాలతో, సంప్రదాయ దుస్తులతో వచ్చిన అభిమానులతో అక్కడంతా కోలాహలం కనిపించింది. ఢిల్లీకి చేరుకున్న అనంతరం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో ద్రౌపది ముర్ము భేటీ అయ్యారు. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధానమంత్రి నివాసానికి ఆమె వెళ్లి, తనను రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.