PM Modi To Visit Karnataka On March 12: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోయే కర్ణాటక రాష్ట్రంలో మరోసారి ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు. ఈ నెల 12న కర్ణాటకకు వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంతో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపుగా రూ. 16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. ప్రతిష్టాత్మక 10 వరసల మైసూర్-బెంగళూర్ ఎక్స్ ప్రెస్ వేను ప్రధాని మాండ్యాలో ప్రారంభించనున్నారు. ఆ తరువాత హుబ్బళ్లి-ధార్వాడలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేయనున్నారు.
Read Also: BSF Jobs: బీఎస్ఎఫ్ ఉద్యోగాల్లో మాజీ అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్.. కేంద్రం నిర్ణయం
మైసూర్-బెంగళూర్ ఎక్స్ప్రెస్వేను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం 118 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని రూ. 8480 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఇది బెంగళూర్, మైసూర్ నగరాల మధ్య ప్రమాణ సమయాన్ని 3 గంటల నుంచి కేవలం 75 నిమిషాలకు తగ్గనుంది. మైసూరు-ఖుషాల్నగర్ 4 లేన్ హైవేకి కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 92 కి.మీ.లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ సుమారు రూ. 4130 ఖర్చుతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ రహదారి వల్ల బెంగళూర్,ఖుషాల్ నగర్ మధ్య ప్రయాణ సమయం 5 గంటల నుంచి 2.5 గంటలకు తగ్గుతోంది. ధర్వాడ్ లో ఐఐటీని ప్రారంభించనున్నారు. హుబ్బళ్లిలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫారమ్ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఈ రికార్డును ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. 1507 మీటర్ల పొడవైన ప్లాట్ఫారమ్ను సుమారు రూ.20 కోట్లతో నిర్మించారు.
త్వరలోనే ఎన్నికలు జరగబోతున్న కర్ణాటక రాష్ట్రంలో వరసగా ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. మరోసారి ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వరసగా అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రముఖ సినీనటి, మాండ్యా ఎంపీ సుమలత ప్రధాని సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఆమె ఈ రోజు బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు.