PM Modi: బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఢిల్లీలో మిత్రపక్షాలు ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని కొనియాడాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై ధ్వజమెత్తారు. భారతదేశంలో మందకొడి వృద్ధిరేటను ‘‘హిందూ గ్రోత్ రేట్’’గా పిలిచారని, అది వాస్తవానికి ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’ అంటూ దుయ్యబట్టారు. విధానపరమైన, పాలనాపరమైన వైఫల్యాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశాన్ని నిస్సాహయ దుస్థితిలోకి నెట్టేశాయని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలన వారసత్వం నుంచి దేశాన్ని ఎన్డీయే ప్రభుత్వం విముక్తి చేసిందని మోడీ చెప్పారు. 12 ఏళ్ల ఎన్డీయే పాలనలో కాంగ్రెస్ దుర్మార్గపు పాలన నుంచి దేశం విముక్తి పొందిందని, వేగవంతమైన అభివృద్ధి సాధ్యం కాదని ప్రజల్ని నమ్మించాలరని, చాలా తెలివిగా దానికి హిందూ గ్రోత్ రేట్ అని పిలిచారని మండిపడ్డారు. విధానపరమైన వైఫల్యాలకు బాధ్యత తీసుకోవడం మానేసి, దానిని దేశంలో మెజారిటీ వర్గంపై నిందలు వేసేలా హిందూ గ్రోత్ రేట్ అనే భావనను ప్రచారం చేశారని అన్నారు. పనితీరు, బాధ్యత, వైఫల్యాలు అన్నీ కాంగ్రెస్వే అని, కానీ అపవాదు మాత్రం దేశంలోని హిందూ జనాభాపై నెట్టారని అన్నారు.
2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టాక దేశ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయని ప్రధాని అన్నారు. సరైన ఉద్దేశంతో పనిచేస్తే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని నిరూపించామని, దీనిని దేశ ప్రజలు చూశారని అన్నారు. ఎన్డీయే పనితీరుతో దేశంలోని 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని మోడీ తెలిపారు. ఇది తమ ప్రభుత్వ విధానాలు సరైన దిశలో ఉన్నాయనే దానిని నిదర్శనమని చెప్పారు. ఈ విజయం వ్యక్తిగతం కాదని, ఎన్డీయే కుటుంబం మొత్తం సాధించిన విజయమని ప్రధాని అన్నారు.
అసలు ‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’ అంటే ఏమిటి.?
‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’ అనే పదాన్ని ఆర్థిక శాస్త్రవేత్త రాజ్కృష్ణ 1978లో ఉపయోగించారు. స్వాతంత్య్రం తర్వాత 1950 నుంచి 1980ల వరకు భారత జీడీపీ వృద్ధిరేటు సుమారు 3.5%–4% మాత్రమే ఉండేది. అయితే, ఈ నెమ్మదైన వృద్ధిరేటనున సూచించడానికి ఈ పదాన్ని వాడారు. ‘‘తక్కువతో సంతృప్తి పడే హిందూ జీవనశైలి’’ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోలేదు అనే భావనను తీసుకువచ్చారు.
ఇప్పుడు ఈ పదమే వివాదానికి కారణమైంది. ఆర్థిక వృద్ధి నెమ్మదికి హిందువుల సంస్కృతి కారణం కాదని, నిజానికి దీనికి కారణం ప్రభుత్వం విధానాలు, భారీగా ప్రభుత్వ నియంత్రణ, నిర్బంధ నియామాలు కారణమని ఆర్థికవేత్తలు ఎత్తిచూపారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిని ఒక మతానికికి ఆపాదించడం అన్యాయమని చెప్పారు. 1990లలో భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించిన తర్వాత వృద్ధి పుంజుకుంది. అప్పటి నుంచి ఈ ‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’ అనేది పాత పదంగా మారింది. అయితే, 2023లో మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ భారతదేశం ప్రమాదకరంగా ‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’కు దగ్గరగా ఉందని అన్నారు. ఈయన వ్యాఖ్యలు అనేక మంది ఆర్థిక వేత్తల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాయి. ఎస్బీఐ చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ మాట్లాడుతూ.. దీనిని తప్పుడు అంచనాగా, పక్షపాతపూరిత వ్యాఖ్యగా విమర్శించారు.

