India Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి భారత్, పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత, యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. 26 మందిని బలి తీసుకున్న ఈ ఉగ్రదాడిలో పాకిస్తాన్, లష్కరే తోయిబా ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా తేలింది. అయితే, పాకిస్తాన్ ఇప్పటికే తన సైన్యాన్ని భారత సరిహద్దుల్లో మోహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ సాయంతో భారత సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం వస్తోంది.
Read Also: Pakistan: కవ్విస్తున్న పాకిస్తాన్.. రాజస్థాన్ సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్, ఆర్టిలరీ యూనిట్స్..
ఈమేరకు బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో భారత్ హై అలర్ట్ ప్రకటించింది. రాడికల్ గ్రూపులను పాకిస్తాన్ గూఢచార సంస్థ “ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్” (ఐఎస్ఐ) యాక్టివ్ చేసినట్లు తెలుస్తోంది. రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోందని భారత నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. హై సర్వెలైన్స్లో నిఘా వర్గాలు ఉన్నాయి. బంగ్లా సరిహద్దుల్లో భారత సైనిక దళాలు అప్రమత్తమయ్యాయి.
షేక్ హసీనా పదవిలో ఉన్నంత కాలం భారత్కి బంగ్లాదేశ్ అత్యంత మిత్రదేశంగా ఉంది. ఎప్పుడైతే, ఆ దేశంలో మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం పదవిలోకి వచ్చిందో అప్పటి నుంచి పాకిస్తాన్తో సంబంధాలను బలపరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే యూనస్ సర్కార్ పాక్ ఐఎస్ఐకి మద్దతు ఇస్తోందనే ఆరోపణ ఉంది. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ సైనిక అధికారులుఉన్నట్లు భారత్ నిఘా సంస్థల నివేదికలు చెబుతున్నాయి. రోహంగ్యా శరణార్థుల్ని ఉపయోగించి అస్థిర పరిచే ప్రయత్నాలకు తెరతీసింది. దీనికి తోడు బెంగాల్లో నకిలీ పాస్పోర్టులో ఉన్న పాక్ జాతీయుడిని అరెస్ట్ చేయడం కలకలం సృష్టించింది. మరోవైపు, ఉగ్రవాదం,జాతీయ భద్రతతో రాజీపడేది లేదని కేంద్రం పునరుద్ఘాటించింది.