Nitin Gadkar Reacts On Governor Koshyari Comments On Chhatrapati Shivaji: ఛత్రపతి శివాజీపై గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమే సృష్టించాయి. ఔరంగాబాద్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో ఆయన ప్రసంగిస్తూ.. శివాజీ మహారాజ్ పాతకాలం నాటి ఆరాధ్య దైవమని, ఇప్పుడు బీఆర్ అంబేద్కర్తో పాటు నితిన్ గడ్కరీ ఉన్నారంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై శివసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు సైతం గవర్నర్పై మండిపడ్డారు. ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అయితే.. గవర్నర్ను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఛత్రపతి శివాజీని ప్రపంచంలోనే మరే ఇతర వ్యక్తితో పోల్చలేరని, మహారాష్ట్ర చరిత్ర తెలియని వ్యక్తి (కోష్యారీ) ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధకరమన్నారు.
అంతటితో ఆగలేదు.. కేంద్రంలోని బీజేపీ పార్టీకి, సీనియర్ నేతలకు ఇక్కడి చరిత్ర తెలిసినట్టు లేదంటూ ప్రత్యక్షంగానే చురకలంటించారు. గవర్నర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరారు. ఈ విధంగా షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే కామెంట్స్ చేయడంతో.. మహారాష్ట్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. అంతకుముందు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సైతం గవర్నర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. గవర్నర్ను తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేసిన ఆయన.. అసలు షిండే మహారాష్ట్ర బిడ్డేనా? అని నిలదీశారు. సీఎం షిండే వెంటనే రాజీనామా చేయాలని కోరారు. ఏడాది వ్యవధిలోనే గవర్నర్ కోష్యారీ నాలుగుసార్లు ఛత్రపతి శివాజీని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారని.. అయినా మహారాష్ట్ర ప్రభుత్వ చోద్యం చూస్తూ మౌనంగా ఉందంటూ విరుచుకుపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రే వర్గం కూడా గవర్నర్పై ధ్వజమెత్తారు.
ఈ నేపథ్యంలోనే నితిన్ గడ్కరీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు, ఆయన ముందుకొచ్చారు. శివాజీ మహారాజ్ తమకు దేవుడితో సమానమని, తల్లిదండ్రుల కంటే ఆయన్ను ఎక్కువగా పూజిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ట్విటర్లో శివాజీపై తాను చేసిన ఆసక్తికర వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. దీంతో.. మహారాష్ట్రలో రేగిన పొలిటికల్ ప్రకంపనలకు చెక్ పెట్టినట్లయ్యింది.