NTV Telugu Site icon

Congress Leader: షేక్ హసీనాకు పట్టిన గతే మోడీకి కూడా.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

Congress

Congress

Congress Leader: బంగ్లాదేశ్‌ని ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్‌లో ఉన్న పరిస్థితులు భారత్‌లో కూడా జరగొచ్చని ఆయన వ్యాఖ్యానించడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దేశంలో హింసను రాజేయడం కాంగ్రెస్ ఉద్దేశమా..? అని కమలం పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే మరో కాంగ్రెస్ నేత సజ్జన్ సింగ్ వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బంగ్లాదేశ్ మాదిరిగానే భారత్‌లో ఏదో రోజు ప్రధాని నరేంద్రమోడీ ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. షేక్ హసీనాకు పట్టిన గతే ప్రధాని మోడీకి పడుతుందని అన్నారు. బంగ్లాదేశ్‌లో వేలాది మంది నిరసనకారులు సోమవారం ఢాకాలోని షేక్ హసీనా ఇంటిని ముట్టడించారు. ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయి వచ్చిన కొన్ని గంటల తర్వాత కాంగ్రెస్ నేత ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: MP Fraud: సరికొత్త మోసం.. వాట్సాప్ డీపీలో కలెక్టర్ ఫొటో పెట్టి నగదు కాజేసిన కేటుగాళ్లు

ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ (ఐఎంసి)లో జరిగిన కుంభకోణాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి వర్మ మాట్లాడుతూ, పొరుగు దేశంలో బంగ్లాదేశ్‌‌లో షేక్ హసీనా పాలనకి వ్యతిరేకంగా పౌర అశాంతి సమయంలో బంగ్లాదేశ్ ప్రజలు ప్రధాని అధికారిక నివాసంలోకి ప్రవేశించారని టీవీ ఛానెల్‌లు కథనాలు ప్రసారం చేస్తున్నాయని అన్నారు. ‘‘నరేంద్ర మోదీ జీ, మీ తప్పుడు విధానాల వల్ల ఏదో ఒక రోజు ప్రజలు ప్రధాని నివాసంలోకి ప్రవేశించి (పీఎం హౌస్‌ని) ఆక్రమించుకుంటారు, ఇది ఇటీవల శ్రీలంకలో (2022లో) జరిగింది, ఆ తర్వాత బంగ్లాదేశ్‌ జరిగింది. రేపు భారత్ వంతు’’ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ యువమోర్చా కాంగ్రెస్ నాయకుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. 140 కోట్ల భారతీయులు మనోభావాలను వర్మ దెబ్బతీశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పరిశీలించి, చర్యలు తీసుకుంటామని అడిషనల్ డీసీపీ రామ్ సనేహి మిశ్రా తెలిపారు.