Site icon NTV Telugu

Maharashtra: “దేశంలో మోడీ.. రాష్ట్రంలో షిండే”.. బీజేపీ-శివసేన మధ్య చిచ్చుపెట్టిన యాడ్..

Maharashtra

Maharashtra

Maharashtra: మహరాష్ట్రలో పాలక బీజేపీ- శివసేన(ఏక్ నాథ్ షిండే) కూటమిలో లుకలుకలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. తాజాగా ఓ పత్రికా ప్రకటన ఈ రెండు పార్టీల మధ్య విబేధాలకు కారణం అవుతోంది. ‘‘దేశంలో మోడీ.. మహారాష్ట్రలో షిండే’’ అనే ట్యాగ్ లైన్ తో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీ పత్రికా ప్రకటన వేయించింది. ఈ ప్రకటన బీజేపీలో అసంతృప్తికి కారణం అవుతోంది. ఈ పత్రికా ప్రకటనపై ప్రతిపక్ష ఎన్సీపీ, కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే శివసేనలు ఫైర్ అవుతున్నాయి.

గతంలో మహారాష్ట్రలో బీజేపీ ఇలాగే ‘‘ ఢిల్లీమే నరేంద్ర ఔర్ రాజ్య మే దేవేంద్ర’’ అని ప్రచారం చేసింది. గతేడాది శివసేన పార్టీలో అసమ్మతి తరువాత మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేకు మద్దతుగా నిలిచారు. దీంతో బీజేపీ- శివసేన(ఏక్ నాథ్ షిండే) కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంతవరకు ఉద్దశ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వం మహావికాస్ అఘాడీ గద్దె దిగాల్సి వచ్చింది. ఏక్ నాథ్ షిండే సీఎం, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో షిండే క్యాంప్ నాయకులు బహిరంగంగానే బీజేపీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. బీజేపీ తమను సవతి తల్లిలా చూస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎంగా ఏక్ నాథ్ షిండేకు 26.1 శాతం మద్దతు, ఫడ్నవీస్ కు 23 శాతం మద్దతు ఉన్నట్లు ఓ ప్రైవేట్ ఛానెల్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇరు పార్టీలకు కలిసి 46 శాతం ప్రజాధరణ ఉన్నట్లు సర్వేలో తేలింది. బీజేపీకి 30.2 శాతం, షిండే శివసేనకు 16.2 శాతం ప్రజలు మద్దతు పలికారని ప్రకటనలో పేర్కొన్నారు.

Read Also: Gambhir vs Dhoni: ఎంఎస్ ధోనీ వల్ల భారత్‌కు ప్రపంచకప్‌లు రాలేదు.. అసలు హీరో అతడే: గంభీర్

ప్రధాని మోడీ, సీఎం ఏక్ నాథ్ షిండేలు ప్రారంభించిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, పథకాల వల్లే పాపులారిటీ పెరిగిందని యాడ్ పేర్కొంది. ఇదిలా ఉంటే బాలా సాహెబ్ ఠాక్రే గురించి ప్రస్తావన లేకపోవడంపై ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. కోట్ల రూపాయాలను ప్రకటన కోసం ఖర్చు చేసినట్లు ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ షాలను చూసి షిండే వర్గం ఎంతగానో భయపడుతోందని, ముఖ్యమంత్రి బాలాసాహెబ్ ఠాక్రేను పూర్తిగా మర్చిపోయారని రౌత్ ట్వీట్‌ చేశారు. ‘‘ఇప్పటి వరకు నా రాజకీయ జీవితంలో దినపత్రికల్లో ఇలాంటి ప్రకటనలు చూడలేదు. ఆ ప్రకటనలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం షిండే ఫొటోలు ఉన్నాయి. వారు (శివసేన) వారు బాలాసాహెబ్ ఠాక్రే సైనికులని చెప్పారు, అయితే బాలాసాహెబ్ థాకరే మరియు ఆనంద్ డిఘేల ఫోటోలు ప్రకటనలో లేవు’’ అని ఎన్సీపీ నేత అజిత్ పవార్ విమర్శించారు.

అయితే బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ దారేకర్ మాట్లాడుతూ.. ఏక్ నాథ్ షిండే ప్రకటనపై ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఇందులో దేవేంద్ర ఫడ్నవీస్ ను తక్కువగా చేసినట్లు ఉందని, ఇద్దరం కలిసి ప్రతిపక్షాలకు బలం చూపాలని, షిండే వర్గంలోని 40 మంది ఎమ్మెల్యేలు బీజేపీ అధికారంలోకి తెచ్చాయని శివసేన ఎంపీ గజన కిరీటికర్ అనడాన్ని తప్పుపట్టారు.

Exit mobile version