BJP: ప్రధాని నరేంద్రమోడీని ‘‘ఉగ్రవాది’’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఖర్గే క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ నేతలు అన్నామలై, సంబిత్ పాత్ర వంటి వారు కాంగ్రెస్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అన్నామలై మాట్లాడుతూ.. ఖర్గే ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆయన ప్రధాని పదవి గౌరవాన్ని దిగజార్చారని, ఖర్గే బహిరంగ క్షమాపణలు చెప్పి, ప్రజల్ని క్షమాభిక్ష కోరాలని డిమాండ్ చేశారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నిరాశ, నిస్పృహ, మానసిక దివాళాను సూచిస్తున్నాయని అన్నారు. ఖర్గే వ్యాఖ్యలు 145 కోట్ల మంది ప్రజల్ని అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఇది కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా పన్నిన కుట్ర అని, రాహుల్ గాంధీ ప్రతీరోజూ తన ప్రసంగాలలో ప్రధానిపై అవమానకరమైన భాష ఉపయోగిస్తున్నారని, రాహుల్ ఆదేశాల మేరకు ఖర్గే ప్రధానిని ఉగ్రవాదిగా పిలిచారని ఆరోపించారు. ఒసామా బిన్ లాడెన్ వంటిని వారిని ‘‘ఒసామా జీ’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్కు ఉందని అన్నారు.
