Karnataka High Court: అత్యాచార కేసు విచారణ సమయంలో కర్ణాటక హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిందితుడిగా ఉన్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థి బెయిల్ పిటిషన్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నేరాలను అరికట్టాలంటే కఠిన శిక్షలు అవసమరని కోర్టు అభిప్రాయపడుతూ.. ‘‘ఒకరి కాలు లేదా చెయ్యి నరికివేస్తే ప్రజలు చట్టాలను పాటిస్తారేమో’’ అని వ్యాఖ్యానించింది. 23 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ సమయంలో జస్టిస్ ఆర్ నటరాజ్ ధర్మాసనం ఈ కామెంట్స్ చేసింది.
మన దేశంలో చట్టం తన పదును కోల్పోతోందని, కఠినమైన శిక్షలు ఉంటేనే ప్రజల్లో చట్టం పట్ల భయం పెరుగుతుందని, కొన్ని పశ్చిమాసియా దేశాల్లో కఠిన శిక్షల కారణంగా ప్రజలు చట్టాన్ని ఉల్లంఘించడానికి భయపడుతారు అని కోర్టు వ్యాఖ్యానించింది. నిందితుడి తరుపున న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ దాదాపుగా రెండు నెలల నుంచి జైలులో ఉన్నాడని, తాను చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్నాడని వాదించారు.
దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ఉప్పు తింటే నీళ్లు తాగాల్సిందే అని వ్యాఖ్యానించారు. అవసరమైతే నిందితుడు మరికొన్ని రోజులు జైలులో ఉండొచ్చని, భవిష్యత్తులో శిక్ష పడితే మళ్లీ జైలుకు వెళ్లా్ల్సి రావచ్చని అన్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 8కి వాయిదా వేసింది.
కేసు వివరాలను పరిశీలిస్తే.. ఈ కేసు మూడేళ్ల క్రితం నాటిది. నిందితుడు ఒక యువతిని స్నేహం పేరుతో మాట్లాడుకుందామని చెప్పి ఒక అపార్ట్మెంట్కు తీసుకెళ్లాడు. 2023 సెప్టెంబర్ 12న లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 375(a), 376 కింద నమోదు చేశారు. ఈ కేసులో ఉడుపి జిల్లా సెషన్స్ కోర్టు ఇప్పటికే నిందితుడి బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు.
