Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్‌కు భారత్ విజ్ఞప్తి

  • మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు
  • ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరదాడులు
  • శాంతించాలంటూ ఇరుదేశాలకు భారత్ విజ్ఞప్తి
  • చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని వినతి
India

India

పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై 100 రోజులైంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. శాంతి ఒప్పందం జరగొచ్చని అంతా భావిస్తున్నారు. ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని అంతా అనుకుంటే.. అందుకు భిన్నంగా మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. జూన్ 7న ఉత్తర ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులు ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. దీనికి ప్రతీకారంగా సోమవారం ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో మరోసారి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే ఆపాలని కోరింది.

ఏప్రిల్ 8 నుంచి మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ.. ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. దీంతో హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ వ్యవహారం ఇరాన్‌కు రుచించడం లేదు. లెబనాన్‌పై దాడులు ఆపితేనే శాంతి చర్చలు జరుగుతాయని ఇరాన్ అంటోంది. ఈ నేపథ్యంలో లెబనాన్‌పై దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం లెక్కచేయలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జూన్ 7 రాత్రి ఉత్తర ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై ప్రతీకార దాడులకు దిగింది.

×
×
Ad

ఇప్పటికే మధ్యప్రాచ్యం యుద్ధంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. గ్యాస్, చమురు కష్టాలతో ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మరోసారి పశ్చిమాసియా అట్టుడకడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే దాడులు ఆపాలని ఇరాన్, ఇజ్రాయెల్‌కు భారతదేశం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది.

‘‘ఘర్షణలు ఇప్పటికే 100 రోజులకు పైగా కొనసాగుతోంది. దీనివల్ల అపారమైన మానవీయ వేదన, ప్రాణనష్టం సంభవించింది.’’ అని భారత్ పేర్కొంది. ప్రాంతీయ స్థిరత్వం, అంతర్జాతీయ భద్రతపై ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ సహా అన్ని పక్షాలు తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని భారత్ పిలుపునిచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న చర్చలను వేగవంతం చేసి.. దౌత్యపరమైన పరిష్కారానికి చేరుకోవాలని సూచించింది. మధ్యప్రాచ్యంలో మళ్లీ శాంతి, స్థిరత్వం నెలకొనేలా అన్ని పక్షాలు చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని.. కొనసాగుతున్న చర్చలను విజయవంతంగా ముగించి దౌత్యపరమైన పరిష్కారానికి రావాలని భారత ప్రభుత్వం తన ప్రకటనలో స్పష్టం చేసింది.