NTV Telugu Site icon

PM Modi: ఆర్మీ హిమాలయాల వలే దృఢంగా నిలబడినంత కాలం భారత్ సురక్షితం..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ గత సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ సారి కూడా దీపావళి వేడుకలను భారత సైన్యంతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చాలో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘మన సైన్యం దేశ సరిహద్దుల్లో హిమాలయాల మాదిరి దృఢంగా నిలబడినంత కాలం భారత్ సురక్షితంగా ఉంటుంది’’ అని ఆయన అన్నారు.

Read Also: Himaja Arrest: నేను అరెస్టు కాలేదు.. పోలీసులు అందుకే వచ్చారు- వీడియో రిలీజ్ చేసిన హిమజ

ప్రపంచవ్యాప్తంగా వివాదాల మధ్య సరిహద్దుల్లో భద్రత కల్పించడంలో ఆర్మీ పాత్రను ఆయన కొనియాడారు. ఈ రోజు ప్రపంచ పరిస్థితలను బట్టి, భారతదేశంపై అంచనాలు నిరంతరం పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో భారత సరిహద్దుల్ని సురక్షితంగా ఉంచడం ముఖ్యమని అన్నారు. మనం దేశంలో శాంతి వాతావరణాన్ని సృష్టిస్తున్నాము.. ఇందులో ఆర్మీ పాత్ర చాలా కీలకం అని ప్రధాని మోదీ అన్నారు. ‘‘నేను ప్రతీ ఏడాది మా ఆర్మీ సిబ్బందితో దీపావళి జరుపుకుంటున్నాను.. రాముడు ఉన్న అయోధ్య అని అంటారు.. నా వరకు మాత్రం భారత ఆర్మీ సిబ్బంది ఉన్న అయోధ్య అని, నేను ప్రధాని, సీఎంగా లేనప్పుడు కూడా దీపావళి జరుపుకునేందుకు సరిహద్దు ప్రాంతాలకు వెళ్లాను’’ అని మోడీ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆర్మీ ఎన్నోయుద్ధాలు చేసి దేశ హృదయాలను గెలుచుకున్నారని, అంతర్జాతీయ శాంతి మిషన్‌లో సైన్యం వల్లే భారత దేశ గ్లోబర్ ఇమేజ్ పెరిగిందని ప్రధాని కొనియాడారు.

లెప్చాలో సైనిక శిబిరాన్ని ఈ రోజు ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడి సైనికులతో ముచ్చటించారు. మిలిటరీ దుస్తులు ధరించిన మోడీ సైనికులతో మమేకమయ్యారు. 2014 నుంచి ప్రధాని మోదీ ప్రతీ సంవత్సరం సైనికులతో దీపావళిని జరుపుకుంటున్నారు. 2014లో తొలిసారి సియాచిన్ లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. గతేడాది కార్గిల్‌లో దీపావళి జరుపుకున్నారు.