India Pakistan Tension: పాకిస్తాన్ పహల్గామ్ ఉగ్రవాద దాడి చేసింది, కానీ భారత్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ఊహించలేకపోయింది. పాకిస్తాన్ ఎన్ని ఉగ్రవాద దాడులకు చేయించినా, యుద్ధాలు చేసినా ఎప్పుడూ కూడా ‘‘సింధు జలాల ఒప్పందం’’ జోలికి భారత్ వెళ్లలేదు. కానీ, ఈసారి మాత్రం భారత్ పాకిస్తాన్కి దిమ్మతిరిగే దెబ్బతీసింది. ‘‘ఇండస్ వాటర్ ట్రిటీ’’ని నిలపుదల చేసింది. ఇప్పటికే, చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యామ్, జీలం నదిపై ఉన్న కిషన్ గంగా ప్రాజెక్టుల గేట్లను పూర్తిగా క్లోజ్ చేసింది. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్లోని చీనాబ్ పరివాహక ప్రాంతంలో నీటి తగ్గదలను నమోదైంది.
Read Also: India Pakistan War: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాలపై ప్రభావం?
ప్రధానంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అయిన పాకిస్తాన్ ఇప్పుడు భారత్ నిర్ణయాలతో వణుకుతోంది. పూర్తిగా నీటిని అడ్డుకున్నా, లేక నిలిచిన నీటిని ఒక్కసారిగా వదిలేసినా పాకిస్తాన్ వ్యవసాయం కుదేలు అవ్వడం ఖాయం. ఖరీఫ్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పరిణామాలు ఆ దేశంలో భయాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా, చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్, సలాల్ ఆనకట్టలను మూసేయడం ఆ దేశాన్ని కలవరపరుస్తోంది. పాకిస్తాన్ సింధు నది వ్యవస్థ అథారిటీ సలహా కమిటీ చీనాబ్ నది ప్రవాహంలో అకస్మాత్తుగా తగ్గుదల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పాకిస్తాన్లో 21 శాతం నీటి కొరత ఉండవచ్చని పేర్కొంది. ఇప్పటికే ఏప్రిల్ నెలలో సింధు నీటి వ్యవస్థలో 43 శాతం కొరక ఉంటుందని అంచనా వేసింది.
పాకిస్తాన్ గుండా 700 కి.మీ ప్రవహించే చీనాబ్ నది, సింధు నది వ్యవస్థకు చాలా కీలకం. పాకిస్తాన్ వ్యవసాయంలో 80 శాతం సాగునీటి అవసరాలను సింధు నది తీరుస్తుంది. సింధు నదికి ఉపనది అయిన చీనాబ్ దీనిలో కీలకం. భారత్ ఆనకట్టల్ని మూసేయడంతో చీనాబ్ నీరు తగ్గింది. దీంతో రానున్న రోజుల్లో వరి, పప్పుధాన్యాలు, నూనె గింజలు, మొక్కజొన్న, చెరకు వంటి ఆహార పంటల ఉత్పత్తిని భారత నిర్ణయం తీవ్రంగా దెబ్బతీస్తుంది.