Strait of Hormuz: ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభాన్ని సృష్టిస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల తర్వాత చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేసింది. ఈ మార్గం ద్వారా వెళ్లే నౌకలపై దాడులు చేస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ ఇరుకైన సముద్ర మార్గం ద్వారానే సాగుతాయి. దీంతో ఆసియాతో పాటు యూరప్ దేశాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి.
ఇదిలా ఉంటే, హార్ముజ్ను తెరవడానికి బ్రిటన్ ‘‘హార్ముజ్ సమ్మిట్’’ నిర్వహిస్తుందని ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ వెల్లడించారు. 35 దేశాలతో ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి భారత్కు కూడా యూకే నుంచి ఆహ్మానం అందిందని, 35 దేశాల సమావేశంలో పాల్గొనాలని కోరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. గురువారం సాయంత్రం జరుగనున్న ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి వర్చువల్ (ఆన్లైన్) విధానం ద్వారా పాల్గొంటారని మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
Read Also:Donald Trump: ‘‘ఆయన భార్య దారుణం, చెంపపై ఇంకా వాపు ఉంది’’.. మక్రాన్పై ట్రంప్ సెటైర్లు..
LPG, LNG, చమురు రవాణాకు ఆటంకం లేకుండా ఉండేందుకు భారత్ ఇరాన్, గల్ఫ్ లోని ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నటత్లు జైస్వాల్ వెల్లడించారు. భారత్కు తన చమురులో 40 %, LNGలో 50%, ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG)లో 80% ఈ మార్గం గుండానే వస్తోంది. దీంతో ఈ జలమార్గం భారత్కు చాలా అవసరం. ఇదిలా ఉంటే, భారత్ లాంటి మిత్రదేశాలకు హార్ముజ్ తెరిచే ఉంటుందని ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది.
మరోవైపు, అమెరికా కూడా హార్ముజ్ తెరిపించడంపై దృష్టి పెట్టింది. హార్ముజ్ లో స్వేచ్చా నౌకాయానానికి చర్యలు తీసుకుంటే ఇరాన్తో కాల్పుల విరమణకు ఒప్పుకుంటామని అమెరికా చెబుతోంది. మరోవైపు, ట్రంప్ బ్రిటన్, ఫ్రాన్స్లను టార్గెట్ చేస్తూ వారి చమురు అవసరాలు వారే చూసుకోవాలని చెప్పడం గమనార్హం. దమ్ముంటే హార్ముజ్ నుంచి చమురు తెచ్చుకోవాలని సూచించారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా మరియు UAEలతో సహా 35 దేశాలు సముద్ర భద్రతను పునరుద్ధరించడానికి సహకరించుకోవాలని అంగీకరిస్తూ ఒక ప్రకటనపై సంతకం చేశాయని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ చెప్పారు.
