Corona cases: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే కాస్త తగ్గాయి. శుక్రవారం ఉదయం వరకు 21,880 కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 21,411 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇటీవల కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు తాజాగా 67 మంది కరోనా బారినపడి చనిపోయారు. కొవిడ్ నుంచి తాజాగా 20,726 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.46 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతానికి పెరిగింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు దేశంలో మరో 4,80,202 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,25,997 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,50,100 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో మొత్తం కేసులు 4,38,68,476కి చేరగా.. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,31,92,379 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో భారత్లో 34,93,209 మందికి కరోనా వ్యాక్సిన్లు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 201.68 కోట్లు దాటింది. అటు ప్రపంచ దేశాల్లో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 3,49,174 మంది వైరస్ బారినపడగా.. మరో 335 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 57,11,73,227కు చేరింది. ఇప్పటివరకు మహమ్మారి కారణంగా 63,95,685 మంది మరణించారు.