కేంద్ర ప్రభుత్వ “అగ్నిపథ్” పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి.. ఆ నిరసనలపై ఆర్మీ చీఫ్, జనరల్ మనోజ్ పాండే స్పందించారు. ఆర్మీ శిక్షణ ప్రక్రియ ప్రత్యేకంగా,ఆలోచనాత్మకంగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.. నిర్దిష్ట ప్రమాణాలు పొందుపర్చాం.. అవి నిరంతరం పర్యవేక్షించబడతాయి మరియు పరీక్షించబడతాయని స్పష్టం చేశారు. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా భారత్కు సమర్ధవంతమైన సైన్యాన్ని అందించగలమని అభిప్రాయపడ్డారు ఆర్మీ చీఫ్..
Read Also: Agnipath Protest: అగ్గి రాజేసిన అగ్నిపథ్.. డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి
భారత సాయుధ దళాలలో ఎక్కువ మంది యువతను నమోదు చేసుకునేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ “అగ్నిపథ్” పథకాన్ని ప్రారంభించినట్టు వెల్లడించారు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే.. ఇక, ఈ పరీక్షకు వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచామని గుర్తుచేశారు.. ఈ నిర్ణయం వల్ల దేశంలోని యువతకు తమ దేశభక్తిని చాటుకునే అవకాశం దక్కుతుందన్నారు.. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఆర్మీ రిక్రూట్మెంట్ నిర్వహించలేకపోయామని.. యువతకు ఇప్పుడు మంచి అవకాశం లభిస్తుందని తెలిపారు.. ఇక, ఆర్మీ రిక్రూట్మెంట్కు సంబంధిచిన షెడ్యూల్ను త్వరలోనే ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే.