మహిళా దినోత్సవానికి ఒక్కరోజు ముందు కేంద్రం షాకిచ్చింది. వంటింట్లో గ్యాస్ ధర పెంపుతో ఝలక్ ఇచ్చింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరపై ఏకంగా రూ.60 పెంచింది. వాణిజ్య సిలిండర్పై రూ.115 పెంచింది. ఈ మేరకు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్ నగరంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.965కి చేరింది.
అయితే ఉజ్వల్ పథకం లబ్ధిదారులకు కేంద్రం ఊరట కలిగించింది. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు వెల్లడించాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలోనే ధరలు పెరిగినట్లు సమాచారం.
ఫిబ్రవరి 28 నుంచి మధ్యప్రాచ్యంలో యుద్ధం జరుగుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. పైగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ధరల పెరుగుదలకు కారణమైంది. మరిన్ని రోజులు యుద్ధం కొనసాగితే మాత్రం ధరలు కొండెక్కడం ఖాయంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే అలాంటి ఇబ్బందులు ఉండబోవని కేంద్రం చెబుతున్నప్పటికీ ధరలు పెరగడం ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి.
గృహ వినియోగ సిలిండర్ ధర ఏప్రిల్ 2025 నుంచి పెరగలేదు. భీకర యుద్ధం జరుగుతున్న కారణంగా పెరిగినట్లుగా తెలుస్తోంది. తాజా పెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల గృహ LPG సిలిండర్ ధర రూ.853 నుంచి రూ.913 కు పెరిగింది. ముంబైలో రూ.912.50గా ఉంది. చెన్నైలో రూ.928.50కి పెరిగింది.