Joe Biden: భారత్ జీ20 సమావేశాలను అట్టహాసంగా నిర్వహిస్తోంది. విదేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఇతర అధికారులు మొత్తం 40 మందికి పైగా కీలక వ్యక్తులు ఢిల్లీకి వచ్చారు. ముఖ్యంగా అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు భారీ సెక్యూరిటీ ఇస్తున్నారు. సీఐఏతో పాటు భారతదేశ సెక్యూరిటీ విభాగం అడుగడుగున ప్రెసిడెంట్ భద్రతను పర్యవేక్షిస్తోంది. ఇంత సెక్యూరిటీ ఉండే బైడెన్ కాన్వాయ్ లో ఓ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి, ప్రోటోకాల్ని ఉల్లంఘించారు. ఈ ఘటన శనివారం ఢిల్లీలో జరిగింది.
Read Also: Bihar: మహ్మద్ ప్రవక్తపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..మండిపడుతున్న ప్రతిపక్షం
వెంటనే అక్కడి అధికారులు సదరు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత విచారించి అతన్ని విడుదల చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీలో యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బస చేస్తున్న తాజ్ హోటల్ లోకి అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ లోని ఒక కారు ప్రవేశించింది. దీంతో కారు డ్రైవర్నిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత.. బైడెన్ బస చేస్తున్న ఐటీసీ మౌర్య వద్దకు ఉదయం 9.30 గంటలకు రావాల్సి ఉందని కారు డ్రైవర్ చెప్పాడు. అయితే అతను లోధి ఎస్టేట్ ప్రాంతం నుంచి ఓ వ్యాపారవేత్తను తాజ్ వద్ద డ్రాప్ చేయాల్సి రావడంతో తాజ్ వద్దకు వచ్చినట్లు చెప్పాడు. ప్రోటోకాల్ గురించి తనకు తెలియదని కార్ డ్రైవర్ చెప్పారు. కాన్వాయ్ నుంచి కార్ని తీసుకువచ్చిన తర్వాత భద్రతా అధికారులు అతనిని ప్రశ్నించి విడుదల చేశారు.
ఇదిలా ఉంటే బైడెన్ జీ20 సమావేశాల అనంతరం వియత్నాం బయలుదేరాడు. న్యూఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాల కోసం బైడెన్ శుక్రవారం భారత్ చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. శనివారం ఇతర దేశాధినేతలతో కలిసి జీ20 సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని మహాత్మాగాంధీ స్మారక రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన వియత్నాం బయలుదేరారు.