Ajit Pawar: మహరాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ పార్టీలో తిరుగుబాటు చెలరేగింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సోదరుడి కొడుకు, కీలక నేత అజిత్ పవార్ బీజేపీ-ఏక్ నాథ్ షిండే శివసేన ప్రభుత్వంలో చేరారు. ఓ వైపు శరద్ పవార్, బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఇది జరిగింది. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే మంత్రి వర్గంలో చేరారు. ఆయనతో పాటు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు.
Read Also: Mayawati: “యూనిఫాం సివిల్ కోడ్ కు వ్యతిరేకం కాదు, కానీ”.. మాయావతి కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేందుకే మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమిలో చేరాలని నిర్ణయం తీసుకున్నామని అజిత్ పవార్ చెప్పారు. ప్రధాని మోడీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని.. ఆయన నాయకత్వాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆయన ప్రయత్నంలో పాలుపంచుకోవడానికే ఈ బీజేపీతో చేతులు కలిపానని అన్నారు. ఈ రోజు ఎన్సీపీ నేతలు ప్రమాణ స్వీకారం చేశారని.. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీలో చేస్తామని అజిత్ పవార్ స్పష్టం చేశారు.
కేంద్రంలో బలమైన నాయకత్వం కావాలి.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, మహారాష్ట్రలో అభివృద్ధి తన ప్రాధాన్యతన అని విలేకరుల సమావేశంలో అజిత్ పవార్ చెప్పారు. మొత్తం ఎన్సీపీ బీజేపీతో చేరిందని అజిత్ పవార్ వెల్లడించారు. దేశాన్ని ంముందకు తీసుకెళ్లే ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదని ఆయన ఆరోపించారు. ఎన్సీపీకి మొత్తం 53 మంది ఉంటే 40కి పైగా ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ప్రఫుల్ పటేల్ కూడా అజిత్ పవార్ వెంట ఉన్నట్లు తెలుస్తోంది.