Congress Plans East-West Bharat Jodo-Like Yatra Before 2024 Polls: కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తీసుకురావడానికి ఆ పార్టీ ‘‘భారత్ జోడో యాత్ర’’ను ప్రారంభించింది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగుతోంది. మొత్తం 3570 కిలోమీటర్ల మేర 5 నెలల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. జమ్మూ కాశ్మీర్ తో ఈ యాత్ర ముగుస్తోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ముగిసింది. ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. డిసెంబర్ మొదటివారంలో భారత్ జోడో యాత్ర రాజస్థాన్ లోకి ప్రవేశించనుంది.
Read Also: Dharampal Singh: మదర్సా విద్యార్థులు మౌళ్వీలుగా మారడం కాదు.. ఐఏఎస్ అధికారులు కావాలి…
ఇదిలా ఉంటే మరో జోడో యాత్రకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల ముందు తూర్పు నుంచి పశ్చిమం వైపు భారత్ జోడో యాత్రను నిర్వహించే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకుడు విభాకర్ శాస్త్రీ మంగళవారం వెల్లడించారు. దీని కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భారత్ జోడో యాత్ర దేశంలోని ధనిక, పేదల మధ్య అంతరాన్ని తగ్గించడం, దేశంలో సామరస్యాన్ని నెలకొల్పడం, ద్రవ్యోల్భాన్ని, నిరుద్యోగం వంటి సమస్యలను లేవనెత్తడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు.
రాజస్థాన్ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర మార్గాన్ని మంగళవారం ఖరారు చేస్తారని విభాకర్ శాస్త్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ఝలావర్, కోట, దౌసా, అల్వార్ ప్రాంతాల గుండా సాగనుంది. కేంద్రంలో ఎనిమిదేళ్లుగా బీజేపీ సాగిస్తున్న దుష్ఫరిపాలనకు వ్యతిరేకంగా యాత్ర కొనసాగిస్తున్నట్లు రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా అన్నారు. బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూ.. రాహుల్ గాంధీ కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారని ఆయన అన్నారు.