దేశ వ్యాప్తంగా సోమవారం రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్లో 37 మంది సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి.
అయితే ఒడిశాలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మాత్రం ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో గెలిచిన ఏకైక కాంగ్రెస్ ముస్లిం ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌస్ ప్లేట్ ఫిరాయించింది. కాంగ్రెస్ హైకమాండ్ సూచించిన అభ్యర్థికి కాకుండా.. అన్యూహంగా బీజేపీ అభ్యర్థికి ఓటేసింది. ఆమెతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. దీంతో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు.
ఒడిశాలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేడీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. అయితే చివరి నిమిషంలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం ప్లేట్ ఫిరాయించారు. ప్రస్తుతం ఈ వార్త దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సోఫియా ఫిర్దౌస్ ఒడిశాలోని బారాబతి-కటక్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. ముస్లిం సమాజం నుంచి ఎన్నికైన మొదటి మహిళా ఎమ్మెల్యే ఈమెనే కావడం విశేషం.
ఒడిశాలో మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకు సోమవారం ఓటింగ్ జరిగింది. అయితే ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్ జెనా, దాశరథి గోమాంగ్, సోఫియా ఫిర్దౌస్ క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం సూచించిన అభ్యర్థికి కాకుండా… బీజేపీ అభ్యర్థికి ఓటేశారు. రెండు రోజుల క్రితం సోఫియా ఫిర్దౌస్ మాట్లాడుతూ.. ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలో నిర్ణయించేటప్పుడు మమ్మల్ని సంప్రదించాలి కదా? మా అనుమతి అడగక్కర్లేదా? అని ప్రశ్నించారు. ఆమె నిలదీసినట్టుగానే ఓటింగ్ సమయంలో ప్లేట్ ఫిరాయించింది.
సోఫియా ఫిర్దౌస్ ఎవరు?
సోఫియా ఫిర్దౌస్.. ఆగస్టు 23, 1991న కటక్లో జన్మించారు. ఒడిశాలోని బారాబతి-కటక్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. ముస్లిం సమాజం నుంచి వచ్చిన మొదటి మహిళా ఎమ్మెల్యే. ఆమె మిలీనియల్ ఎమ్మెల్యే కూడా. 1981-1996 మధ్య జన్మించిన వారిని ‘‘మిలీనియల్స్’’గా పరిగణిస్తారు.
సోఫియా.. మాజీ ఎమ్మెల్యే అయిన మహ్మద్ మోకిమ్ కుమార్తె. మోకిమ్ 2019 నుంచి 2024 వరకు బారాబతి-కటక్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అవినీతి కేసుల కారణంగా ఒడిశా హైకోర్టు అతని సభ్యత్వాన్ని రద్దు చేసింది. 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిని ప్రకటించింది. తదనంతరం కాంగ్రెస్ పార్టీ అతని కుమార్తె సోఫియా ఫిర్దౌస్ను 2024 ఎన్నికల్లో బరిలోకి దింపడంతో విజయం సాధించింది. బీజేపీకి చెందిన పూర్ణ చంద్ర మహాపాత్రపై 8,001 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2024 ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్లో తనకు రూ.5.24 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించింది. 2015లో ఒడిశా వ్యాపారవేత్త షేక్ మెరాజుల్ హక్ను వివాహం చేసుకుంది.
ఇక సోఫియా కటక్లోని సెయింట్ జోసెఫ్ గర్ల్స్ హై స్కూల్, రావెన్షా జూనియర్ కాలేజీలో చదువుకున్నారు. అనంతరం భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT) నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ పట్టా పొందారు. ఇక 2022లో బెంగళూరులోని ఐఐఎంలో ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ను పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు… ఒక ప్రసిద్ధ వ్యాపారవేత్త. మెట్రో గ్రూప్లో డైరెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. రియల్ ఎస్టేట్, ఆస్తి అభివృద్ధి ప్రాజెక్టుల్లో కూడా కీలక పాత్ర పోషించారు. అనేక వ్యాపార, పరిశ్రమ సంస్థల్లో కీలక పదవులను కూడా నిర్వహించారు. 2023 నుంచి 2025 వరకు CREDAI భువనేశ్వర్ చాప్టర్ అధ్యక్షురాలిగా పనిచేశారు. రాష్ట్ర చాప్టర్కు నాయకత్వం వహించిన మొదటి మహిళగా కూడా చరిత్రలో నిలిచారు. 2019 నుంచి 2023 వరకు CREDAIలో CWW ఈస్ట్ జోన్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు. తదనంతరం ఆమె భువనేశ్వర్లోని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC)కి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CIIT)కి కో-చైర్గా ఉన్నారు.